

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ మరోసారి మైదానంలో ఫైర్ అయ్యాడు. మంచి ఫామ్లో వరుస బౌండరీలు బాదుతున్న తరుణంలో ఔట్గా ప్రకటించిన అంపైర్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అరుస్తూ ఆయన వైపు పదేపదే వెనక్కి తిరిగి చూస్తూ డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపోయాడు. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో సోమవారం హిమాచల్ ప్రదేశ్తో రంజీ మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా గంభీర్ కోపంతో ఊగిపోయాడు.
ఢిల్లీ మాజీ కెప్టెన్ గంభీర్ అప్పటికే 44 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్ను హిమాచల్ బౌలర్ మయాంక్ డాగర్ వేశాడు. ఆ ఓవర్లో ఓ బంతిని గంభీర్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. దాంతో బంతి అతని ప్యాడ్లను తాకి చేతుల మధ్యలోనుంచి నడుము పక్కగా వెళ్లి ఫీల్డర్కు చిక్కింది. దీంతో క్యాచ్ కోసం అప్పీల్ చేయగా అంపైర్ ఔట్ ఇచ్చాడు.
నాటౌట్గా భావించిన గంభీర్ అంపైర్ నిర్ణయంతో షాక్ అయ్యాడు. బ్యాట్కు తగల్లేదని సైగలు చేస్తూ అరుస్తూ ఆగ్రహానికి గురైయ్యాడు. దీంతో బంతి బ్యాట్కు తగల్లేదని సైగలు చేస్తూ గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంపైర్వైపు వెనక్కి తిరిగి చూస్తూ తిట్టుకుంటూ గంభీర్ పెవిలియన్ చేరాడు.
ఇప్పటికే ఢిల్లీ రంజీ జట్టు కెప్టెన్సీ నుంచి గంభీర్ తప్పుకోగా.. అతని స్థానంలో యువ ఆటగాడు నితీశ్ రాణా కెప్టెన్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. భావోద్వేగానికి గురైన గంభీర్ గతంలోనూ మైదానంలోని ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగిన సంఘటనలు లేకపోలేదు.