ముంబై: శుక్రవారం వాంఖడె మైదానంలో రంజీ ట్రోఫీ చరిత్రలోనే మహారాష్ట్ర ఆటగాళ్లు స్వప్నిల్ గుగలే, అంకిత్ బావ్నే సరికొత్త రికార్డుని నెలకొల్పిన సంగతి తెలిసిందే. ట్రిపుల్ సెంచరీ, డబుల్ సెంచరీ చేయడంతో పాటు రంజీల్లో దశాబ్దాల భాగస్వామ్య రికార్డును చెరిపివేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మూడో వికెట్కు 594 పరుగులు జోడించి మహారాష్ట్రకు భారీ స్కోరు అందించారు. రంజీల్లో ఏ వికెట్కై నా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. 1946-47 రంజీ సీజన్లో బరోడా ఆటగాళ్లు విజయ్ హజారే, గుల్ మహ్మాద్ నాలుగో వికెట్కు చేసిన భాగస్వామ్యం 577 పరుగుల రికార్డుని అధిగమించారు.
ఓవర్నైట్ స్కోరు 290/2తో శుక్రవారం ఆట రెండోరోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించింది మహారాష్ట్ర ఆటగాళ్లు స్వప్నిల్ (351 నాటౌట్) కెరీర్లో తొలి ట్రిపుల్ సాధించగా, అంకిత్ (258 నాటౌట్) తొలిసారి డబుల్ సెంచరీని అందుకున్నాడు. అయితే ఫస్ట్క్లాస్ క్రికెట్లో ప్రపంచ రికార్డు నెలకొల్పే అవకాశం మాత్రం స్వప్నిల్, అంకిత్ జోడి కోల్పోయింది.
ఎవరీ స్నప్నిల్?
ట్రిపుల్ సెంచరీ సాధించిన 25 ఏళ్ల స్వప్నిల్ గుగలే 2010లోనే తన తొలి రంజీ మ్యాచ్ ఆడాడు. 2010లో రాజస్థాన్పై అరంగేట్రం చేసిన స్వప్నిల్కు అడపాదడపా మాత్రమే అవకాశాలు దక్కాయి. పలు విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబర్చినా నిలకడలేమితో మహారాష్ట్ర సీనియర్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. దీని ఫలితంగా కెరీర్లో ఇప్పటి వరకు 17 రంజీ మ్యాచ్లు మాత్రమే ఆడాడు.
37.88 సగటుతో 1023 పరుగులు చేశాడు. వీటిలో రెండు సెంచరీలు, ఐదు అర్ధసెంచరీలు ఉన్నాయి. శుక్రవారం చేసిన సెంచరీ తన కెరీర్లో మూడో సెంచరీ. అంతకు ముందు 174, 154 పరుగులు చేశాడు. మహారాష్ట్ర రెగ్యులర్ కెప్టెన్ కేదార్ జాదవ్ భారత వన్డే జట్టులోకి ఎంపిక కావడంతో సీనియర్ కాకపోయినా అనూహ్యంగా కెప్టెన్సీ దక్కింది. కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే ట్రిపుల్ సెంచరీ సాధించి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

ఎవరీ అంకిత్ బావ్నే?
ఇక అంకిత్ బావ్నే విషయానికి వస్తే 2007లో ఫస్ట్క్లాస్ అరంగేట్రం చేసిన అతను ఇప్పటిదాకా 61 రంజీ మ్యాచ్లు ఆడాడు. ఔరాంగాబాద్కు చెందిన అంకిత్ 52.03 సగటుతో 4059 పరుగులు చేశాడు. అందులో 13 సెంచరీలు, 23 అర్ధసెంచరీలు ఉన్నాయి. తాను జట్టులోకి వచ్చినప్పటి నుంచి చూస్తే ఇప్పటి వరకు మహారాష్ట్ర తరఫున అత్యధిక సెంచరీలు (12), అత్యధిక సగటు (53.88) అంకిత్ చేసినవే. 2013-14 సీజన్లో మహారాష్ట్ర రంజీ ఫైనల్కు చేరడంలో బావ్నే కూడా కీలక పాత్ర పోషించాడు.
ఇదిలా ఉంటే సరిగ్గా ఐదేళ్ల క్రితం విశాఖపట్నంలో అండర్-19 నాలుగు దేశాల టోర్నీ ప్రారంభానికి ముందు భారత కెప్టెన్ అంకిత్ బావ్నేను జట్టునుంచి చివరి నిమిషంలో బీసీసీఐ తప్పించింది. అతని బర్త్ సర్టిఫికెట్, పాస్పోర్ట్లలో పుట్టిన తేదీలలో తేడాలు ఉండటమే ఇందుకు కారణం. దాంతో ఉన్ముక్త్ చంద్ కెప్టెన్ అవడం, అతడి నేతృత్వంలోని టీమిండియా ప్రపంచ కప్ గెలిచింది.
రంజీ మ్యాచ్ చరిత్రలోనే స్నప్నిల్ ఏడో అత్యధిక స్కోరు నమోదు చేశాడు. అతనికంటే ముందు నింబాల్కర్ (443 నాటౌట్), సంజయ్ మంజ్రేకర్ (377), ఎంవీ శ్రీధర్ (366), విజయ్ మర్చంట్ (359 నాటౌట్), వీవీఎస్ లక్ష్మణ్ (353), పుజారా (352) ఉన్నారు. ఇక, రంజీల్లో కెప్టెన్గా ట్రిపుల్ సెంచరీ చేసిన ఏడో ఆటగాడు స్నప్నిల్ రికార్డు నమోదు చేశాడు. వీరిద్దరూ ఒకే ఇన్నింగ్స్లో 250కు పైగా పరుగులు చేయడం ఇది నాలుగో సారి.