
ముంబై: ముంబైకి చెందిన ఓ క్రికెటర్ ఆత్మహత్మ చేసుకున్నాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 27 ఏళ్ల కరణ్ తివారి అనే క్రికెట్ ప్లేయర్ సోమవారం ఉత్తర ముంబైలోని మలాద్ ప్రాంతంలో తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కరణ్ ముంబై ప్రొఫెషనల్ క్రికెట్ జట్టుకు నెట్ ప్రాక్టిస్ బౌలర్. దేశవాళీ ట్రోఫీల సమయంలో ముంబై బ్యాట్స్మన్కు అతడు నెట్ బౌలింగ్ చేసేవాడు.
కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్కు సంబంధించి పలు టోర్నీలు, మ్యాచ్లు వాయిదా పడ్డాయి. ఇప్పటికీ కూడా దేశవాళీ టోర్నీలు జరగడం లేదు. దీంతో కరణ్ తివారి తన క్రికెట్ కెరీర్ పట్ల ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్లు కురార్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని చెప్పారు.
ముంబై మలాద్ ప్రాంతంలోని సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన కరణ్ తివారి కెరీర్లో సరైన అవకాశాలు రావడంలేదని తన స్నేహితులతో చెప్పేవాడని పోలీసులు తెలిపారు. ముంబై సీనియర్ జట్టులో చోటు కోసం కరణ్ పలుమార్లు ప్రయత్నించినప్పటికీ.. అవకాశం రాలేదని తెలుస్తోంది. కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన మ్యాచ్ల వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురైనట్లు సమాచారం. కరణ్ మృతి పట్ల నటుడు జితు వర్మ విచారం వ్యక్తం చేశారు. కరణ్ చాలా ఏళ్లుగా క్రికెట్లో ఎదగడానికి కష్టపడుతున్నాడని పేర్కొన్నారు.
కరణ్ తివారి క్లోజ్ ఫ్రెండ్ రాజస్థాన్లో ఉంటున్నాడు. అతనితో కరణ్ అన్ని విషయాలను షేర్ చేసుకునేవాడట. ముంబై సీనియర్ జట్టులో చోటు దక్కట్లేదని, ఇక తాను బ్రతికి ఉండనని అతనికి కాల్ చేసి చెప్పాడట. అతడు ఎంత నచ్చజెప్పినా.. కరణ్ వినలేదట. ఇదే విషయం అతడు కరణ్ సోదరికి చెప్పాడట. అయితే కరణ్ మానసిక స్థితి గురించి అతని సోదరి తల్లికి లేటుగా చెప్పడంతో అప్పటికే అతడు చనిపోయాడు.