ఆ ఘనత ఆయనకూ దక్కాలి:
తాజాగా రమీజ్ రాజా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ... 'రాహుల్ ద్రవిడ్ కోచింగ్ శైలి బాగుంది. రెండో వన్డే విజయంలో ఘనత ఆయనకూ దక్కాలి. అండర్-19, భారత్-ఏ కోచ్గా ఆయన యువకులను తీర్చిదిద్దారు. వారిపై ఎంతో నమ్మకం ఉంచారు. ద్రవిడ్ వల్లే టీమిండియా రిజర్వు బెంచి అత్యంత పటిష్ఠంగా మారింది. ద్రవిడ్ యువ కోచ్లా కనిపిస్తారు. దాంతో కుర్రాళ్లు సులభంగా ఆయనతో కలిసిపోతున్నారు. శ్రీలంక సిరీస్ కోసం ఆయన కుర్రాళ్లకు మంచి శిక్షణ ఇచ్చారు. దీపక్ చహర్ సైతం ఒత్తిడిని ఎదుర్కొని అజేయంగా నిలిచాడు. భారత జట్టుకు ఊహించని విజయం అందించాడు' అని అన్నాడు.
ద్రవిడ్పై ప్రశంసల వర్షం:
అండర్-19, భారత్-ఏ కోచ్గా బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. అతడి మార్గనిర్దేశం వల్లే భారత క్రికెట్ జట్టు మరింత దుర్భేద్యంగా మారిందని పేర్కొంటున్నారు. టీమిండియా రిజర్వు బెంచి అత్యంత పటిష్ఠంగా మారడానికి ఆయనే కారణమన్నారు. ఇప్పుడు శ్రీలంకలో భారత జట్టుకు కోచ్గా వెళ్లడంతో భవిష్యత్తు భారత కోచ్గా అతడిని వర్ణిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా టీమిండియా తొలిసారి రెండు దేశాల్లో వేర్వేరు జట్లతో తలపడుతున్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ నాయకత్వంలో సీనియర్లతో కూడిన జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా.. శిఖర్ ధావన్ కెప్టెన్సీలో యువకులతో కూడిన జట్టు శ్రీలంకకు వెళ్లింది. భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడంతో.. ద్రవిడ్ లంకకు వెళ్లిన బృందానికి కోచ్గా ఉన్నాడు. ద్రవిడ్ టీమిండియాకు కోచ్గా పనిచేయడం ఇది రెండోసారి. 2014లో ఇంగ్లండ్తో జరిగిన పర్యటనలో బ్యాటింగ్ కన్సల్టెంట్గా జట్టుతో పాటు వెళ్లారు.
రవిశాస్త్రి తర్వాత:
టీమిండియా హెడ్ కోచ్ పదవి అత్యంత విలువైనది. చాలా కాలం పాటు బీసీసీఐ విదేశీ కోచ్లనే నమ్ముకున్నా.. ఆ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. అనిల్ కుంబ్లే, రవిశాస్త్రిలు హెడ్ కోచ్లుగా నియమితులయ్యారు. వారి కాలంలో టీమిండియా అద్భుతమైన విజయాలు సాధించింది. ముఖ్యంగా రవిశాస్త్రి హెడ్కోచ్ అయిన తర్వాత రెండుసార్లు ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలోనే ఓడించింది కోహ్లీసేన.. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు కూడా చేరింది. అయితే అతని పదవీకాలం ఈ ఏడాది చివర్లో జరగనున్న టీ20 ప్రపంచకప్తో ముగియనుంది. దీంతో అతని తర్వాత ఎవరు అన్న చర్చ ఇప్పుడే ప్రారంభమైంది. రవిశాస్త్రి తర్వాత టీమిండియా హెడ్ కోచ్ రాహులే అని అందరూ అంటున్నారు.
మరికొద్ది గంటల్లో ఓపెనింగ్ సెర్మనీ..ఒలింపిక్స్ను రద్దు చేయాలంటూ స్టేడియం దగ్గర ఆందోళన!
https://telugu.mykhel.com/more-sports/protesters-gathered-outside-the-tokyo-metropolitan-building-as-olympic-2021-flame-arrived-036181.html