హైదరాబాద్: సల్మాన్ భట్ను పాకిస్ధాన్ జాతీయ జట్టులోకి తిరిగి ఆడేందుకు అనుమతించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)పై ఆ దేశ మాజీ క్రికెటర్, ప్రస్తుతం కామెంటేటర్గా వ్వవహరిస్తున్న రమీజ్ రాజా తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.
అసలు అతనికి మళ్లీ ఆడే అవకాశాన్ని పీసీబీ ఎందుకు కల్పించిందంటూ ధ్వజమెత్తాడు. అదే సమయంలో పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని రమీజ్ పేర్కొన్నాడు.

'పాకిస్తాన్ క్రికెట్లో ఫిక్సింగ్ అనేది భాగంగా మారిపోయింది. అందుకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు లేవనే నేను అనుకుంటున్నా. పీఎస్ఎల్లో ఫిక్సింగ్కు పాల్పడిన వారిపై సైతం కఠిన చర్యలు లేవు. సల్మాన్ భట్కు మళ్లీ జాతీయ జట్టులో ఆడటానికి గ్రీన్ సిగ్నల్ ఎందుకు ఇచ్చినట్లు. అతనొక 'రోగ్' క్రికెటర్. అతని మళ్లీ అవకాశం కల్పించడంతో పీసీబీ ఏమీ చెప్పదలుచుకుంది' అని రమీజ్ కాస్తంత ఘాటుగా మాట్లాడాడు.
స్పాట్ ఫిక్సింగ్ కేసులో తనపై విధించిన ఐదేళ్ల నిషేధాన్ని సల్మాన్ భట్ గతేడాది పూర్తి చేసుకున్నాడు. దీంతో ఇంజామాముల్ హక్ నేతృత్వంలోని పాకిస్థాన్ సెలక్షన్ కమిటీ మాజీ కెప్టెన్ అయిన సల్మాన్ భట్ను జాతీయ జట్టులోకి తిరిగి ఆడేందుకు అనుమతించింది.
2010 ఇంగ్లాండ్ పర్యటనలో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడిన భట్, ఆసిఫ్, ఆమిర్లు జైలు కెళ్లడంతో పాటు ఐదేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్నారు. వీరిలో ఇప్పటికే అమిర్ పాక్ జట్టులో పునరాగమనం చేయగా, ఆసిఫ్ తిరిగి ఆడటానికి కొన్ని నెలల క్రితం పీసీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.