హైదరాబాద్: జనవరి 29న ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ ఫైనల్స్లో టెన్నిస్ స్టార్లు రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్ తలపడిన సంగతి తెలిసిందే. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్ పాకిస్థాన్లో టెలికాస్ట్ కాకపోవడాన్ని ఆ దేశ మాజీ క్రికెట్ కెప్టెన్ రమీజ్ రాజా తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.

సౌత్ ఆసియా దేశాల్లో ఈ మ్యాచ్ ప్రసారమైనా, పాకిస్థాన్లోని కేబుల్ నెట్వర్క్ ఛానల్స్లో ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ మ్యాచ్ ప్రసారం కాకపోవడాన్ని రమీజ్ తీవ్రంగా తప్పుబట్టాడు. 'నమ్మశక్యంగా లేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్లో భాగంగా రోజర్-ఫెడరర్ లైవ్ మ్యాచ్ పాక్లో ప్రసారం కాకపోవడం బాధాకరం. ఆ క్రీడ మనకు స్నేహ పూర్వక క్రీడ కాకపోవచ్చు. కానీ ఒక క్రీడా దేశంగా ఉన్న మనం మరొక క్రీడను కనీసం ఛానెల్ ద్వారా కూడా ప్రమోట్ చేయకపోవడం అవమానకరం' అని రమీజ్ రాజా ట్విట్టర్ పోస్టు చేశాడు.
రమీజ్ రాజా ట్వీట్కు మరికొంతమంది పాకిస్థాన్ అబిమానులు మద్దతుగా నిలిచారు. ఓడిపోయిన సిరీస్లను ప్రసారం చేసే పీటీవీ టెన్నిస్ను మాత్రం అసలు పట్టించుకోదని హుస్సేన్ అనే నెటిజన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విమర్శించాడు.
హోరాహోరాగా సాగిన ఆ ఫైనల్లో రఫెల్ నాదల్పై స్పెయిన్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ పైచేయి సాధించాడు. టైటిల్ కోసం ఇద్దరి ఆటగాళ్ల మధ్య రసవత్తరంగా జరిగిన మ్యాచ్లో ఫెదరర్ 6-4, 3-6, 6-1, 3-6, 6-3 తేడాతో నాదల్పై విజయం సాధించాడు. ఫెదరర్కు తన కెరీర్లో 18వ గ్రాండ్స్లామ్ టైటిల్ కావడం విశేషం.