
ఇస్లామాబాద్: మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్-19) పూర్తిగా వెళ్లిపోయాక భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగాలని ఆ దేశ మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత రమీజ్ రాజా అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు సరిగా లేకపోడంతో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య చాలా కాలం నుండి ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. చివరిసారిగా 2012లో ద్వైపాక్షిక సిరీస్లో దాయాదులు తలపడ్డారు. అప్పటినుండి కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే ఆడుతున్నాయి. ఇక చివరగా గతేడాది వన్డే ప్రపంచకప్లో భారత్-పాక్ జట్లు తలపడ్డాయి.
తాజాగా ఓ యూట్యూబ్ వీడియోలో మాట్లాడిన రమీజ్ రాజా... 'భారత్-పాకిస్థాన్ క్రికెట్పై ఎందుకంత ఒత్తిడి ఉందో అర్థంకావడం లేదు. కరోనా వెళ్లిపోయాక భారత్-పాక్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ ఉండాలి. క్రికెట్ నుంచి ఇరు దేశాలూ ఎంతో నేర్చుకోవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు. అందుకోసం కృషి చేయాల్సిన అవసరం ఏంతో ఉంది. ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ కోసం నేను ఎదురు చూస్తున్నా' అని అన్నారు.
2004 పాక్ సిరీస్ను రమీజ్ రాజా గుర్తు చేసారు. వ్యత్యాసం తగ్గించడానికి ఇరు దేశాల అభిమానులు స్టేడియంలో కలిసి కూర్చునేలా ఆ సిరీస్ చేసిందన్నారు. 'భారత్-పాక్ మధ్య క్రికెట్ జరగాలంటే చిన్న చిన్న ప్రయత్నాలు జరగాలి. అలాగే 2019 వన్డే ప్రపంచకప్లో భారత్-పాక్ మ్యాచ్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ప్రసారదారులు, నిర్వాహకులకు కూడా దాయాది దేశాల పోరు అవసరం అని తెలిపారు. అభిమానులు కూడా తటస్థ వేదికలపై ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ జరిగేందుకు ఒత్తిడి తేవాలి' అని ఆయన పిలుపునిచ్చారు.
అంతకుముందు పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. కరోనా వైరస్ కోసం విరాళాల సేకరణకు భారత్-పాక్ జట్ల మధ్య మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్ జరపాలన్నాడు. ఇది అందరికి ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. అయితే అక్తర్ వ్యాఖ్యలపై స్పందించిన టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్.. కరోనా కోసం విరాళాలు సేకరించే స్థితిలో బీసీసీఐ లేదని మండిపడ్డారు. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు క్రికెట్ ఆడతారని అక్తర్ను విమర్శించారు.