ఆగస్టులో కోచ్గా బాధ్యతలు
ఆగస్టులో కోచ్గా బాధ్యతలు తీసుకున్న రమేశ్ పవార్ పదవికాలం నవంబర్ 30తో ముగిసింది. మళ్లీ రమేశ్ పొవార్ దరఖాస్తు చేసుకునే వెసులబాటు ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అతడి కాంట్రాక్టును బోర్డు పొడిగించకుండా భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ పదవికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ఇటీవలి టీ20 ప్రపంచకప్లో సీనియర్ మిథాలీరాజ్ను తప్పించడంలో పొవార్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
పొవార్-మిథాలీ మధ్య వివాదం
దీంతో పొవార్, సీనియర్ క్రికెటర్ మిథాలీరాజ్ మధ్య వివాదం చెలరేగింది. సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ నుంచి మిథాలీ రాజ్ను తప్పించడంపై పొవార్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మిథాలీని తప్పంచడంపై అటు అభిమానులతో పాటు ఇటు మాజీ క్రికెటర్లు సైతం మండిపడ్డారు. ఈ విమర్శల నేపథ్యంలో రమేశ్ పొవార్ను కోచ్గా కొనసాగించేందుకు బీసీసీఐ అయిష్టత చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, మహిళల జట్టు టీ20 జట్టు కెప్టెన్ హర్మన్, వైస్ కెప్టెన్ మంధానలు పొవారే తమకు కోచ్గా కావాలని పట్టుబడుతుండటంతో కోచ్ ఎంపిక ఆసక్తికరంగా మారింది.
కోచ్ని ఎంపిక చేసే బాధ్యత వీరిదే
మరోవైపు సరైన అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాం తా రామస్వామిలతో కూడిన అడ్హాక్ ప్యానెల్ను కూడా బీసీసీఐ నియమించింది. ఇదంతా ఓవైపు సాగుతుండగా మరోవైపు సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ మాత్రం వివాదాస్పద మాజీ కోచ్ రమేశ్ పొవార్నే కొనసాగించాలంటూ సరికొత్త చర్చకు తెరలేపింది.
రాయ్ వైఖరిని తప్పుబట్టిన ఎడుల్జీ
దీంతో పాటు కోచ్గా పొవార్ ఎంపికపై బీసీసీఐ పాలకుల కమిటీ(సీవోఏ) చీఫ్ వినోద్ రాయ్ వైఖరిని కూడా డయానా ఎడుల్జీ తన లేఖలో తప్పుబట్టింది. కోచ్ ఎంపికలో కెప్టెన్ విరాట్ కోహ్లీకి లేని అభ్యంతరం కౌర్కు ఎందుకంటూ ప్రశ్నించింది. "కోచ్ విషయంలో మహిళా క్రికెటర్లు బీసీసీఐకి లేఖ రాయడంలో తప్పులేదు. వారు నిజంగా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. కానీ గతంలో కోచ్ మార్పు విషయంలో సీఈఓ రాహుల్ జోహ్రీకి కోహ్లీ నిరంతరం ఎస్ఎంఎస్లను పంపాడు. అలాగే కోచ్ పదవి కోసం నిర్ణీత సమయంలో దరఖాస్తు చేయలేదని రవిశాస్త్రి కోసం గడువును కూడా పొడిగించారు. దీన్ని నేను అప్పట్లోనే వ్యతిరేకించాను. అందుకే కోచ్గా రవిశాస్త్రి ఉండాలని కెప్టెన్ కోహ్లీ కోరినప్పుడు.. మహిళల కెప్టెన్ హర్మన్ప్రీత్ సూచనను ఎందుకు సమ్మతించరు?" అని రాయ్కు రాసిన లేఖలో ఎడుల్జీ తెలిపారు.