హైదరాబాద్: మెగా ఈవెంట్ల ముందే ఇలా క్రీడాకారిణుల మాట విని కోచ్ను తొలగించడం సరికాదంటూ కొందరు విమర్శకులు వినిపించిన వాదనకు బీసీసీఐ చెక్ పెట్టింది. పలు ఫిర్యాదులను ఎదుర్కొంటూ తానంతట తానే టీమిండియా కోచ్ బాధ్యతల నుంచి తప్పకున్న తుషార్ అరోథె స్థానంలో రమేశ్ పవార్ను తీసుకుంటోన్న నిర్ణయాన్ని బీసీసీఐ వెల్లడించింది.
కొద్ది రోజుల క్రితం భారత్ మహిళల జట్టు కోచ్ తుషార్ ఆ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సీనియర్ క్రీడాకారిణులు కోచ్ పద్ధతి సరిగా లేదంటూ బీసీసీఐకి ఫిర్యాదు చేయడంతో తుషార్ రాజీనామా చేశారు. దీంతో మహిళల జట్టుకు తాత్కాలిక కోచ్గా టీమిండియా మాజీ క్రికెటర్ రమేశ్ పవార్ను ఎంచుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. జులై 25 నుంచి బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో మిథాలీ సేన శిక్షణ తీసుకోనుంది.
అప్పటి నుంచే రమేశ్ జట్టుతో కలవనున్నాడు. 'వచ్చే నెలలో భారత మహిళల జట్టుకు పూర్తి స్థాయి కోచ్ను ఎంపిక చేస్తాం. ఇందుకోసం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశాం. జాతీయ జట్టు లేదా రాష్ట్రానికి చెందిన ఫస్ట్ క్లాస్ జట్టుకు కోచింగ్ బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉన్న 55 సంవత్సరాలలోపువారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చిన బీసీసీఐ తెలిపింది.
'బీసీసీఐ ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు నాకు అప్పగించింది. ఎంతో సంతోషంగా ఉంది. భారత జట్టు మంచి విజయాలు సాధించేలా కృషి చేస్తా' అని పవార్ తెలిపారు. ఈ నెల 20లోగా దరఖాస్తులు పంపాలని సూచించింది. రమేశ్ పవార్ భారత్ తరఫున 2 టెస్టులు, 31 వన్డేలు ఆడారు. కాగా, సీనియర్ క్రీడాకారులైన మిథాలీ రాజ్, జులన్ గోస్వామిలు బాగానే సహకరించారు. హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రమే నాపై ఫిర్యాదులు చేసింది. కేవలం ఒక పక్కనే వాదన వినడం సరికాదని, క్రీడాకారిణుల ప్రవర్తన సరిగా లేదని తుషార్ పదవీ విరమణ చేసేముందు ఆవేదన వ్యక్తం చేశాడు.