స్టార్ హీరో రామ్ చరణ్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL)లో హైదరాబాద్ టీమ్ను కొనుగోలు చేశాడు. టెన్నిస్ బంతితో ఆడే ఈ ఐఎస్పీఎల్ భారత క్రికెట్లో తొలి టీ10 లీగ్. దీనిలో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు ఉన్నాయి. ట్రోఫీ కోసం ముంబయి, హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా, శ్రీనగర్, చెన్నై జట్లు తలపడనున్నాయి.
వచ్చే ఏడాది మార్చి 2 నుంచి 9 వరకు ఐఎస్పీఎల్ జరగనుంది. మొత్తం 19 మ్యాచ్లు ముంబయిలోనే జరగనున్నాయి. అయితే హైదరాబాద్ జట్టును సొంతం చేసుకున్నట్లు రామ్ చరణ్ ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్లో హైదరాబాద్ జట్టుకు యజమాని అవ్వడం సంతోషంగా ఉందని రామ్ చరణ్ అన్నాడు. టాలెంట్ను ప్రోత్సహించడంతో పాటు సమాజంలో స్ఫూర్తిని పెంపొందించడం, స్ట్రీట్ క్రికెట్ను సెలబ్రేట్ చేసుకోవడం దీని ప్రధాన సారాంశమని వివరించాడు.లీగ్లో భాగమయ్యే వారు రిజిస్టర్ చేసుకోవాలని సూచించాడు.

రిజిస్టర్ గడువు జనవరి 14 వరకు ఉంది. కాగా, ఈ లీగ్లో ఫ్రాంచైజీ యజమానులుగా దాదాపు సినీ అగ్రహీరోలే ఉండటం విశేషం. ముంబయి జట్టుకు బిగ్బి అమితాబ్ బచ్చన్, బెంగళూరు జట్టుకు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, అలాగే జమ్మూ-కశ్మీర్ టీమ్కు స్టార్ హీరో అక్షయ్ కుమార్ యజమానులుగా వ్యవహరిస్తున్నారు.
ఈ లీగ్ గురించి బీసీసీఐ కోశాధికారి ఆశిష్ షెలార్ మాట్లాడుతూ.. "ఐఎస్పిఎల్ లీగ్తో డైనమిక్, వినోదాత్మక క్రికెట్ ఫార్మాట్ను తెరపైకి తీసుకురావడమే కాకుండా, అసాధారణ ప్రతిభను వెలికి తీస్తుంది" అని అన్నాడు. టీమిండియా మాజీ కోచ్, ప్రముఖ వ్యాఖ్యాత రవిశాస్త్రి ఈ లీగ్పై స్పందిస్తూ .. క్రికెటర్లు తమ కలలను నెరవేర్చుకోవడానికి ఇది ఒక చక్కని వేదిక అని అన్నారు.