హైదరాబాద్: టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే తరహాలోనే రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్లను బీసీసీఐ బహిరంగంగా అవమానిస్తోందని రామచంద్ర గుహ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సహాయక కోచ్లుగా వాళ్ల పేర్లను బయటకు తీసుకొచ్చి ఇప్పుడు యూ టర్న్ తీసుకోవడం ఏంటని ఆయన విమర్శించారు.
టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ కన్సల్టెంట్లుగా రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్లను నియామకాన్ని నిలిపి ఉంచామని బీసీసీఐ శనివారం పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోవైపు కొత్త కోచ్ రవిశాస్త్రిని సంప్రదించాకే సహాయక సిబ్బందిని నియమిస్తామని బీసీసీఐ పాలకుల కమిటీ స్పష్టం చేసింది.
దీంతో జహీర్ ఖాన్, రాహుల్ ద్రవిడ్ల నియామకాలు జులై 22 వరకు నిలిచిపోయాయి. ఇక సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్ వినోద్ రాయ్, డయానా ఇడుల్జి, బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ టీమిండియా ప్రధాన కోచ్గా రవిశాస్త్రి నియామకాన్ని ఆమోదించారు.
గంగూలీ, సచిన్, లక్ష్మణ్తో కూడిన క్రికెట్ సలహా కమిటీ ప్రకటించినా రవిశాస్త్రిని సంప్రదించాకే వారి నియామకాన్ని ఆమోదిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో రామచంద్ర గుహ స్పందించారు. 'అనిల్ కుంబ్లే తరహాలోనే ద్రవిడ్, జహీర్ను అవమానిస్తున్నారు. ఈ ముగ్గురు దిగ్గజాలు మైదానంలో తమ శాయశక్తులా పోరాడినవారు. వీరిని బహిరంగంగా అవమానించడం సరికాదు' అని గుహ ట్వీట్ చేశారు.
సుప్రీంకోర్టు నియమించిన పాలకుల కమిటీ సభ్యుడైన గుహ బీసీసీఐ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ జూన్లో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే టీమిండియా ప్రధాన కోచ్, సహాయక సిబ్బంది వేతనాలను నిర్ణయించేందుకు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, సీఈవో రాహుల్ జోహ్రీ, డయానా ఇడుల్జి, బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరితో నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటైంది. జులై 19న కమిటీ రవిశాస్త్రితో చర్చించి ఎవరి వేతనం ఎంతో ఈ కమిటీ నిర్ణయం తీసుకోనుంది.