Ram Gopal Varma: టీమిండియా పరాజయంపై ఆర్జీవీ ట్వీట్.. విరాట్ కోహ్లీని ఏమన్నాడో తెలుసా?

హైదరాబాద్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్జీవీ ఎప్పుడు, ఎక్కడ ఎవరిని ప్రశంసిస్తాడో.. ఎవరిపై విమర్శలు చేస్తాడో ఎవరికీ అంతుపట్టదు. ఈరోజు పొగిడిన వ్యక్తిపైనే ఆ మరుసటి రోజే విమర్శలు కురిపించడం కేవలం ఆయనకే చెల్లుతుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విషయంపై ఆర్జీవీ వ్యంగ్యంగా స్పందిస్తుంటాడు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్పై కూడా ఆర్జీవీ తనదైన శైలిలో స్పందించాడు. ఆదివారం రాత్రి దుబాయి వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ ఘోర పరాభవంను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఓడిపోతుందని ఎవరూ అనుకోలేదు. టీ20 ప్రపంచకప్ మ్యాచుల్లో పాక్పై టీమిండియాదే పైచేయిగా ఉంది. భారత్ ఐదు మ్యాచులో గెలుపొందగా.. పాక్ ఒకే విజయం అందుకుంది. దాంతో తప్పకుండా కోహ్లీసేన గెలుస్తుందని చాలా మంది అభిమానులు చెప్పారు. కానీ వారి అంచనాలు భారత ప్లేయర్స్ తలకిందులు చేశారు. బ్యాటింగ్, బౌలింగ్లో విఫలమై ఓటమిని మూటగట్టుకున్నారు. దీంతో ఈ పరాజయాన్ని భారత ఫాన్స్ తట్టుకోలేకపోతున్నారు. భారత ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. కొందరు మిమ్స్, ట్వీట్లు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఎప్పటిలాగే అందరినీ ఆశ్చర్యపరుస్తూ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు రామ్ గోపాల్ వర్మ.
మ్యాచ్ అనంతరం రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశాడు. 'విరాట్ కోహ్లీ నువ్వు మ్యాచ్లో నువ్వు నిజమైన క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించావు. ఎలాంటి అహంభావానికి పోకుండా ప్రత్యర్థుల విజయాన్ని ప్రశంసించావు. అందుకు నీకు వందనాలు' అంటూ ట్విట్టర్ వేదికగా విరాట్ కోహ్లీని ఆర్జీవీ ప్రశంసించాడు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'మీరు క్రికెట్ చూడడం కూడా ప్రారంభించారా' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'క్రికెటర్ల పేర్లు తెలుసా బాస్' అని ఇంకొకరు పేర్కొన్నారు. ఆర్జీవీ లాగే అందరూ సానుకూల దృక్పథంతో ఆలోచించాలి అని కొందరు కామెంట్లు చేశారు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగుల సాధారణ స్కోర్ చేసింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ రోహిత్ శర్మ (0) షహీన్ షా ఆఫ్రిది బౌలింగ్లో డకౌటయ్యాడు. ఆపై మూడో ఓవర్లో లోకేష్ రాహుల్ పెవిలియన్ చేరాడు. కాసేపటికే సూర్యకుమార్ యాదవ్ (11) సైతం ఔటవ్వడంతో భారత్ 31 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ (57; 49 బంతుల్లో 5x4, 1x6), వికెట్ కీపర్ రిషబ్ పంత్ (39; 30 బంతుల్లో 2x4, 2x6) పోరాడి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. చివర్లో ధాటిగా ఆడతారనుకున్న రవీంద్ర జడేజా (13), హార్దిక్ పాండ్యా (11) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
భారత్ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన పాకిస్థాన్.. బ్యాటింగ్లోనూ అదే జోరు కొనసాగించింది. సొంతగడ్డలాంటి దుబాయ్ పిచ్పై పాక్ ఓపెనర్లు తొలి ఓవర్ నుంచే వేగంగా ఆడారు. భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో 4, 6తో మొహ్మద్ రిజ్వాన్ (79; 55 బంతుల్లో 6x4, 3x6) దంచుడు షురూ చేశాడు. బాబర్ అజామ్ (68; 52 బంతుల్లో 6x4, 2x6) కూడా ధాటిగానే ఆడాడు. తొలి నాలుగు ఓవర్లను నలుగురు వేర్వేరు బౌలర్లతో వేయించినా.. భారత్కు ఒక్క వికెట్ దక్కలేదు. మంచి బంతులను ఆచితూచి ఆడిన పాక్ ఓపెనర్లు.. చెత్త బంతులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. భారత బౌలర్లు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోవడంతో పాక్ ఓపెనర్లు ఆడుతూ పాడుతూ పరుగులు చేశారు. దాంతో మరో 13 బంతులు మిగిలుండగానే పాక్ విజయాన్ని అందుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications