దేశవ్యాప్తంగా భారీ హిట్ సొంతం చేసుకున్న రజినీకాంత్ 'జైలర్' సినిమాకు ఆర్సీబీ హీట్ తగిలింది. ఈ చిత్రంలో ఒక సీన్ తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ సీన్ కొంత మంది మనోభావాలు దెబ్బతీసేలా ఉందని పలువురు పిటిషన్లు వేశారు. ఈ క్రమంలోనే దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు దీన్ని సీరియస్గా తీసుకుంది. వెంటనే ఆ సీన్ను సినిమాలో తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ ఆ సీన్ ఏదంటే?
జైలర్ మూవీ మొదటి అర్ధభాగంలో మద్యం మత్తులో ఉన్న రజినీకాంత్ను ఇద్దరు విలన్ మనుషులు ఫాలో అవుతారు. చివరకు వారిని ఒక చోట కార్నర్ చేసిన రజినీ.. ఇద్దర్నీ చంపేస్తాడు. ఈ సీన్లో ఇద్దరు రౌడీల్లో ఒకడు పాపులర్ ఐపీఎల్ టీం 'ఆర్సీబీ' జెర్సీ వేసుకొని ఉన్నాడు. అతన్ని రజినీ చంపేస్తాడు. ఇది చూసిన కొందరు ఫ్యాన్స్.. ఈ సీన్ కావాలనే పెట్టారంటూ మండిపడ్డారు.

ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మంచి రైవలరీ ఉంది. ఈ రెండు టీమ్స్ తలపడే మ్యాచులకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వస్తారు. అయితే ఎక్కువగా ఈ మ్యాచుల్లో సీఎస్కే విజయాలు సాధించింది. ఇప్పుడు జైలర్ సీన్ చూసిన చాలా మంది ట్రోలర్లు.. ఆర్సీబీని చెన్నై టీం ఇలాగే చితక్కొడుతుందంటూ కామెంట్లు చేయడం మొదలు పెట్టారు.
దీని వల్ల విద్వేషాలు చెలరేగే ప్రమాదం ఉందని పలువురు భావించారు. ఈ క్రమంలోనే ఈ సీన్ తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కాగా, గతంలో ఈ రెండు టీమ్స్ అభిమానులు గొడవ పడి చంపుకునే వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఒక ఆర్సీబీ ఫ్యాన్.. తన టీంను అవమానించాడంటూ చెన్నై సూపర్ కింగ్స్ అభిమానికి కత్తితో పొడిచేశాడు. ఈ నేపథ్యంలో జైలర్ సినిమాలో సీన్ మరింత వివాదాస్పదమైంది. కోర్టు ఆదేశాల మేరకు ఈ సీన్ను మేకర్స్ ఎప్పుడు తొలగిస్తారో చూడాలి.