
2019 ప్రపంచకప్ ఎంపిక ఆలోచన ఇంకా నా మదిలోనే ఉంది అని టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తెలిపాడు. సోమవారం రాత్రి జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 193 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. రిషభ్ పంత్ (36 బంతుల్లో 78 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్లు) ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' గెలుచుకున్నాడు. మ్యాచ్ అనంతరం రిషభ్ పంత్ మాట్లాడారు.
'చాలా ఆనందంగా ఉన్నాను. ముఖ్యమైన మ్యాచ్లో జట్టు విజయం సాధిస్తే వచ్చే ఆనందమే వేరు. నేను అబద్దం చెప్పడం లేదు.. ప్రపంచకప్ ఎంపిక ఆలోచన ఇంకా నా మదిలోనే ఉంది. ఆ ఆలోచన నన్ను వదలడం లేదు. అయితే నా కెరీర్పై దృష్టి సారించాను. ఈ పిచ్ అద్భుతంగా ఉంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. జట్టులోని ప్రతి ఆటగాడికి తమ పాత్ర ఏంటో తెలుసు. దానిని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నాం' అని పంత్ తెలిపారు.
పంత్ మెరుపులు:
మొదటగా బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. రహానే (105 నాటౌట్; 63 బంతుల్లో 11ఫోర్లు, 3 సిక్సర్లు), స్మిత్ (50; 32 బంతుల్లో 8ఫోర్లు)లు రాణించారు. అనంతరం 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పంత్ (78 నాటౌట్; 36 బంతుల్లో 6ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీకి అద్భుత విజయాన్ని అందించాడు. ఓపెనర్ ధావన్ (27 బంతుల్లో 54; 8 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ చేసి ఆరంభంలో మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు.