ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్, మాజీ క్రికెటర్ శ్రీశాంత్కు సంబంధించిన ఒక పాత కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2012లో శ్రీశాంత్కు అయిన గాయంపై ఇన్సూరెన్స్ క్లెయిమ్ విషయంలో ఈ వివాదం మొదలైంది. రాజస్థాన్ రాయల్స్ దాఖలు చేసిన ఈ క్లెయిమ్ను యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వ్యతిరేకిస్తోంది. ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది.
అసలు వివాదం ఏంటి?
2012లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడిన శ్రీశాంత్.. ప్రాక్టీస్ మ్యాచ్లో మోకాలికి గాయం కావడంతో ఆ సీజన్కు దూరమయ్యారు. దీంతో ఫ్రాంచైజీ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రూ.82.80 లక్షల క్లెయిమ్ కోరింది. అయితే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఈ క్లెయిమ్ ను తిరస్కరించింది. వారి వాదన ప్రకారం.. శ్రీశాంత్కు 2011 నుంచే కాలి వేలికి గాయం ఉంది. ఈ విషయాన్ని వారు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే సమయంలో వెల్లడించలేదు. ఆ పాత గాయం వల్లే శ్రీశాంత్ 2012లో ఆడలేకపోయాడని ఇన్సూరెన్స్ కంపెనీ వాదిస్తోంది. దీనికి భిన్నంగా.. రాజస్థాన్ రాయల్స్ మాత్రం కాలి వేలి గాయం ఒక సమస్య కాదని.. ఆ గాయంతో కూడా శ్రీశాంత్ ఆడాడని వాదించిది. 2012లో మోకాలికి అయిన కొత్త గాయం వల్లే అతను ఆడలేకపోయాడని, కాబట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ తమకు చెందాలని తెలిపింది.

సుప్రీంకోర్టులో విచారణ
గతంలో ఈ కేసు నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ (NCDRC) లో రాజస్థాన్ రాయల్స్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనితో ఇన్సూరెన్స్ కంపెనీ ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ఈ కేసును విచారించారు. ఈ సందర్భంగా వారు కాలి వేలి గాయం గురించి ఇన్సూరెన్స్ కంపెనీకి ముందుగానే తెలియజేశారా లేదా అని ప్రశ్నించారు. ఒకవేళ ఆ విషయం తెలిసి ఉంటే.. కంపెనీ అతనికి ఇన్సూరెన్స్ ఇచ్చి ఉండకపోవచ్చు లేదా అధిక ప్రీమియం వసూలు చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత, శ్రీశాంత్ ఫిట్నెస్ సర్టిఫికేట్ సహా ఇతర పత్రాలను సమర్పించాలని ఇన్సూరెన్స్ కంపెనీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పత్రాలు సమర్పించిన తర్వాత ఈ కేసు విచారణను తిరిగి ప్రారంభిస్తారు.