
హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో పాటు ఐపీఎల్కు పునరాగమనం చేస్తోన్న జట్టు రాజస్థాన్ రాయల్స్. ఇటీవలే ఐపీఎల్ గీతం విడుదలైంది. ఆ వేడి మీద ఉండగానే ఎనిమిది ఫ్రాంచైజీలలో మొట్ట మొదటిగా రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రచార గీతాన్ని విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ సీజన్ను ఘనంగా ఆరంభించే పనిలో ఉంది.
ఎప్పుడూ నూతన విధానాలు అవలంబిస్తూ..అందరికంటే విభిన్నంగా ఉండే ఈ జట్టు ఈసారి కూడా అదే రీతిలో ముందుకు సాగుతోంది. ఇప్పటివరకూ కనీసం ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు కూడా ఆడని ఆటగాళ్లని ఎంపిక చేసి వారిని క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేయడం, పేరున్న వెటరన్ ఆటగాళ్లని కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడం.. ఇలా ఒక్కటేమిటి రాజస్థాన్ రాయల్స్ ఏది చేసినా అది కొత్తగానే ఉంటుంది. దీనిలో భాగంగా 2018 సీజనులో తొలిసారిగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా తమ జట్టు కెప్టెన్ను ప్రకటించి మరోసారి వార్తల్లో నిలిచింది.
అనంతరం ఫ్రాంఛైజీలంతా విదేశీ కోచ్ల బాట పడుతుంటే రాజస్థాన్ రాయల్స్ మాత్రం స్వదేశీ మాజీ క్రికెటర్ అమోల్ ముజుందార్ను బ్యాటింగ్ కోచ్గా ఎంచుకుంది. అది కూడా ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఇలా రాజస్థాన్ రాయల్స్ ఏది చేసినా అది కొత్తగానే ఉంటుందని మరోసారి నిరూపించింది. రాజస్థాన్ జానపద గాయకురాలు ఇలా అరుణ్ ఈ గీతాన్ని అలపించారు. రాజస్థాన్ గ్రామీణ అందాలతోపాటు, అక్కడి సంస్కృతిని ప్రతిబింబిచేలా ఉన్న ఈ ప్రచార గీతం ఫిర్ హల్లా బోల్ అంటే అర్థం మళ్లీ వచ్చామని గొంతెత్తి చెప్పమని.
'రాజస్థాన్ రంగులతో కూడిన ప్రచార గీతం ఎప్పుడూ మాకు ప్రత్యేకమే. ఫిర్ హల్లా బోల్.. అంటూ ప్రారంభమవుతున్న ఈ గీతాన్ని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు అంకితం చేస్తున్నాం. రెండేళ్ల నిషేధం అనంతరం తిరిగి మైదానంలోకి అడుగుపెడుతున్న మేము.. ఈ ప్రచార గీతం అభిమానులను తిరిగి దగ్గర చేస్తుందని ఆశిస్తున్నాం. ఈ గీతం ప్రతి అభిమాని పెదాల మీద ఉంటుందని' రాజస్థాన్ రాయల్స్ సహా యాజమాని మనోజ్ బదాలే పేర్కొన్నారు.