

హైదరాబాద్: బాల్ టాంపరింగ్ వివాదం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో పాటు భారత దేశీవాలీ లీగ్ అయిన ఐపీఎల్ను ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో జట్టు నుంచి తప్పుకున్న స్టీవ్ స్మిత్ స్థానంలో మరో ఆటగాడిని నియమిస్తూ సోమవారం ప్రకటన విడుదల చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి స్మిత్ స్థానంలో క్లాసెన్ కొనసాగనున్నాడు.
సంవత్సరారంభంలో దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టుతో క్లాసెన్ ప్రత్యర్థిగా తలపడ్డాడు. అరంగేట్ర సిరీస్లోనే అదిరిపోయే శైలిలో ప్రదర్శన చేశాడు క్లాసెన్. నాలుగు వన్డేలు, మూడు టీ20ల్లో భారత స్పిన్నర్లపై విరుచుకుపడి అతడు గొప్పగా రాణించాడు. స్పిన్ను సమర్థంగా ఎదుర్కోగల సత్తా ఉంది. ఇదే కారణంతో మిగతావాళ్లను కాదని క్లాసెన్ను తీసుకోవడానికి మొగ్గుచూపామని రాజస్థాన్ క్రికెట్ హెడ్ జుబిన్ భరుచా తెలిపారు.
స్టీవ్ స్మిత్కు బదులుగా ఐపీఎల్-2018 సీజన్కు రాజస్థాన్ జట్టుకు కెప్టెన్గా ఆజింక్య రహానెను తీసుకున్న విషయం తెలిసిందే. స్పిన్ను ఆడటంలో క్లాసెన్ అద్భుతమైన ఆటగాడు. ఎక్కువగా వైవిధ్యమైన షాట్లు ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతనివైపు ఆసక్తి కనబర్చాం. రివర్స్స్వీప్ చాలా బాగా ఆడుతున్నాడు. ఐపీఎల్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని జుబిన్ పేర్కొన్నారు.
భారత స్పిన్నర్లు యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్లను తనదైన శైలిలో ఎదుర్కొన్నాడని వివరించారు. సౌతాఫ్రికా తరఫున రెండో టీ20 మ్యాచ్లో 30 బంతుల్లో 69 పరుగులు సాధించడంతో క్లాసెన్ హీరో అయ్యాడు.