విశాఖపట్నం: ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ విజయ పరంపర కొనసాగుతోంది. గురువారమిక్కడ ఉత్కంఠభరితంగా సాగిన తమ నాలుగో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడిన రాజస్థాన్ 6 వికెట్లతో గెలుపొందింది. లక్ష్యం చిన్నదే అయినప్పటికీ చివరి బంతికి గానీ రాయల్స్కు విజయం దక్కలేదు.
128 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ అజింక్యా రహానే (56 బంతుల్లో 9 ఫోర్లతో 62) అద్భుత అర్ధసెంచరీతో మెరిసి జట్టుకు సునాయాసంగా విజయాన్ని కట్టబెట్టేలా కనిపించినా, ఆఖర్లో హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గెలుపు కోసం ఆఖరి బంతి వరకూ వేచి చూడాల్సి వచ్చింది. 4 వికెట్లు నష్టపోయి చివరి బంతికి లక్ష్యాన్ని చేరింది.

సంజూ శాంసన్ 26, స్టీవెన్ స్మిత్ 10 పరుగులు చేయగా, స్టువర్ట్ బిన్నీ 16, విన్నింగ్ బౌండ్రీ కొట్టిన ఫాల్క్నర్ 6 పరుగులతో నాటౌట్గా నిలిచారు. హైదరాబాద్ బౌలర్లలో రవి బొపార (2/18), కర్ణ్ శర్మ (1/19) ఆకట్టుకున్నారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ ధవల్ కులకర్ణి (2/9), ప్రవీణ్ తంబే (2/21) ధాటికి 5 వికెట్ల నష్టానికి 127 పరుగులే చేయగలిగింది. మోర్గన్ చేసిన 27 పరుగులే జట్టులో టాప్ స్కోర్. డేవిడ్ వార్నర్ (14 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 21) ధాటిగా ఆడినా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు, చివర్లో రవి బొపార (19 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్తో 23 నాటౌట్) ఊపుతో కనిపించినా, అప్పటికే ఇన్నింగ్స్ ముగింపునకు చేరుకుంది. ధవన్ 10, నమన్ ఓఝా 25, ఆశీశ్ రెడ్డి (నాటౌట్) 13 పరుగులు చేశారు. రహానేకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.
లక్ష్యం ఛేదన సులభం అనుకున్న స్థితిలో రాయల్స్ విజయానికి చెమటోడ్చాల్సి వచ్చింది. ఓపెనర్లు రహానే, శాంసన్ తొలి వికెట్కు 62 బంతుల్లో 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి శుభారంభం ఇచ్చినా, ఆ తర్వాత విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. బొపార, కర్ణ్, భువనేశ్వర్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు.
చివరి 12 బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన పరిస్థితికి రాయల్స్ వచ్చింది. 19వ ఓవర్లో ఆఖరి బంతికి బిన్నీ బాదిన ఫోర్తో ఆఖరి ఓవర్లో కావాల్సినవి ఇక ఐదు పరుగులే. బంతి ప్రవీణ్కుమార్ చేతిలో ఉంది. తొలి బంతికి సింగిలే. ఆ తర్వాత మరో సింగిల్. మూడో బంతికి పరుగే రాలేదు. ఇరు జట్లలో పెరిగిన ఉత్కంఠ. నాలుగో బంతికి మళ్లీ ఒక్క పరుగే వచ్చింది. ఐదో బంతికీ మరో పరుగే. ఇక ఆఖరి బంతికి కావాల్సింది మరో ఒక్క పరుగు కావాల్సి వచ్చింది. ఉత్కంఠకు తెరదించుతూ ఫాల్క్నర్ ఫోర్ బాదడంతో రాజస్థాన్ రాయల్స్కు విజయం దక్కింది.