
ఐపీఎల్ అంటే కేవలం భారీ షాట్లు, ఫోర్లు, సిక్సర్లే కాదు.. ప్రేక్షకుల బీపీ పెంచే అవుట్ స్వింగర్లు, వికెట్లను కూల్చే ఇన్స్వింగర్లు, బ్యాటర్ల బొటనవేళ్లు పగలగొట్టే యార్కర్లు కూడా ఉంటాయి. అందుకే కేవలం బలమైన బ్యాటింగ్ మాత్రమే కాదు. మంచి బౌలింగ్ ఉండటం కూడా ఐపీఎల్లో జట్లకు చాలా ముఖ్యం. మరి వచ్చే ఐపీఎల్ 16వ సీజన్లో బలమైన బౌలింగ్ యూనిట్ ఉన్న జట్టు ఏదో తెలుసుకుందామా?
ఐపీఎల్లో బలమైన బౌలింగ్ ఉన్న జట్లలో టాప్ ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్ ఉంది. ఈ జట్టులో ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ వంటి సూపర్ బౌలర్లు ఉన్నారు. వీరిలో చాహల్ గతేడాది టాప్ వికెట్ టేకర్గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రసిద్ధ్ కృష్ణ కూడా కోహ్లీ వంటి బ్యాటర్లను కూడా తన లైన్ అండ్ లెంగ్త్తో ఇబ్బంది పెట్టాడు. వీరికితోడు ఓబెడ్ మెకాయ్, కుల్దీప్ సేన్ కూడా తమకు దక్కిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకున్నారు.
అంతేకాదు, మినీ వేలంలో విండీస్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ను కూడా రాజస్థాన్ కొనుగోలు చేసింది. హోల్డర్ కేవలం మిడిల్ ఓవర్లలోనే కాదు. డెత్ ఓవర్లలో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పోయించగలడు. అతనితోపాటు ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా కూడా ఈ జట్టులో ఉన్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్లో జంపా అంత గొప్పగా రాణించలేదు. అందుకని ఈ ఏడాది కూడా రాణించడని చెప్పలేం. బిగ్ బ్యాష్ లీగ్లో ఫర్వాలేదనిపించిన జంపా.. ఐపీఎల్లో కూడా అదరగొట్టే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన చూసుకుంటే రాజస్థాన్ వద్ద ఉన్న బౌలర్లు అందరూ కనుక ఒకే రోజు రాణిస్తే.. ఆ జట్టు ఎలాంటి మ్యాచ్ అయినా గెలవగలదు. కనీసం ఇద్దరు ముగ్గురు రాణించినా మరోసారి రాజస్థాన్ నాకౌట్స్ చేరడం ఖాయం. అయితే ప్రసిద్ధ్ కృష్ణ ఈ ఐపీఎల్లో కొన్ని మ్యాచులకు దూరమయ్యే అవకాశం ఉండటం గమనార్హం.