హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం 50 శాతం వాటా విక్రయించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని లీగ్ పాలక మండలికి, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి తెలిపింది. ఐపీఎల్ 2019 సీజన్కు ముందు జట్టుకు ఆర్థికంగా ఊతం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
భారత్లో ఇంగ్లాండ్ పర్యటన..: షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ
రాజస్థాన్ రాయల్స్ ప్రాంఛైజీకి మనోజ్ బాదలే ప్రిన్సిపల్ ఓనర్. ఈ వాటాల విక్రయం నిజమేనని ఆయన వెల్లడించారు. దీనిని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. "అవును, రాజస్థాన్ రాయల్స్ తమ వాటాలో కొంతభాగాన్ని విక్రయించనుంది. ఎక్కువ ధర బిడ్ చేసినవాళ్లకు వాటా దక్కనుంది. దాదాపు 50 శాతం వాటా అమ్మబోతున్నారని తెలిసింది. దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థలు కొనుగోలుకు ఆసక్తిగా ఉన్నాయి" అని అన్నారు.
వాటా విక్రయం తెలియగానే పలువురు బడా పారిశ్రామికవేత్తలు కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ రెండేళ్లు నిషేధానికి గురైనపుడు రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టుతో లీగ్లో ప్రవేశించిన పారిశ్రామికవేత్త సంజీవ్ గోయెంకా రాజస్థాన్లో వాటా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.
ఈ విషయంపై ఆయన ఇంకా స్పష్టత ఇవ్వలేదు. గోయెంకాకు క్రీడా వ్యాపారంలో ఆసక్తి ఉంది. ఆయన ఇప్పటికే ఇండియన్ సూపర్ లీగ్ సాకర్ టోర్నీలో అట్లెటికో డి కోల్కతా జట్టును కలిగివున్నారు.