
'కరోనా వైరస్ మహమ్మారితో భారత ప్రజలు అల్లాడిపోతున్నారు. కరోనాతో బాధపడుతున్న దేశ ప్రజల కోసం తక్షణ సహాయం అందిస్తున్నాం. రాజస్థాన్ రాయల్స్ జట్టు యజమానులు, ఆటగాళ్లు మరియు మేనేజ్మెంట్ నుంచి 1 మిలియన్ డాలర్లు విరాళంగా ఇస్తున్నాం' అని ఆర్ఆర్ ట్వీట్ చేసింది. కొద్ది క్షణాల్లోనే ఈ ట్వీట్ వైరల్ అయింది. ఫాన్స్ రాయల్స్ ప్రాంచైజీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'బెస్ట్ ప్రాంచైజీ', 'ప్రతి ఒక్కరూ ఇలానే ముందుకు రావాలి. ఈ ఫ్రాంచైజిని ఇష్టపడడానికి ఇది కూడా ఓ కారణం', 'ఆర్ఆర్ గొప్ప పనిచేసింది', 'రాయల్స్ అభిమానిగా గర్వంగా ఉంది' అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
కరోనా మహమ్మారి కట్టడికై భారత్ సాగిస్తున్న పోరులో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ శ్రీవత్స్ గోస్వామి తన వంతు సాయం చేశాడు. దేశంలో ఆక్సిజన్ కొరతతో కరోనా బాధితులు అల్లాడుతున్న సమయంలో.. ప్రాణవాయువు సరఫరాకై రూ. 90 వేలు విరాళంగా ఇచ్చి తన గొప్ప మనసు చాటుకున్నాడు. ఈ విషయాన్ని 'డొనాటేకర్ట్' అనే చారిటి ఆర్గనైజేషన్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. కష్ట సమయంలో అందరూ ఏకతాటిపై నిలబడాలని, వీలైనంత మేర సాయం చేయాలని గోస్వామి ప్రజలకు విజ్ఞప్తి చేశాడు.
ఐపీఎల్ 2021లో కోల్కతా నైట్ రైడర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ తన వంతు సాయంగా 50 వేల డాలర్లను భారత పీఎం కేర్స్ ఫండ్కు అందజేసిన విషయం తెలిసిందే. ఇక ఆసీస్ మాజీ పేసర్, ప్రముఖ వ్యాఖ్యాత బ్రెట్ లీ సైతం ఒక బిట్ కాయిన్ను విరాళంగా అందించనున్నట్లు తెలిపాడు. క్రికెటర్లే కాకుండా సినీ ప్రముఖులు కూడా తన వంతు సాయం చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు కొందరు విరాళాలు అందజేశారు.