ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన పోరులో ఓ ఆసక్తికర సంఘటన క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్ రాయల్స్ యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని ఢిల్లీ పేసర్ కైల్ జేమీసన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే వికెట్ తీసిన ఆనందంలో జేమీసన్.. వైభవ్కు అత్యంత దూకుడుగా సెండాఫ్ ఇచ్చాడు. అంతటి అనుభవం ఉన్న అంతర్జాతీయ బౌలర్ కెరీర్ ప్రారంభంలో ఉన్న ఓ కుర్రాడిపై అంతలా విరుచుకుపడటం చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు భగ్గుమన్నారు. "అతను ఇంకా పిల్లాడు, కాస్త నిదానించు జేమీసన్" అంటూ విమర్శలు గుప్పించారు.
అది వైభవ్కు దక్కిన గౌరవం: రాజస్థాన కోచ్
సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కోచ్లు ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తుంటాం. కానీ రాజస్థాన్ రాయల్స్ కోచ్ విక్రమ్ రాథోడ్ మాత్రం పూర్తి భిన్నంగా స్పందించారు. జేమీసన్ ప్రవర్తనను ఆయన సమర్థిస్తూ అది వైభవ్కు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. "ఈ సీజన్లో వైభవ్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అంతటి ప్రమాదకరమైన బ్యాటర్ను ఔట్ చేసినప్పుడు ఏ బౌలరైనా ఎంతో ఉద్వేగానికి లోనవుతాడు. వైభవ్ వికెట్ తీసినందుకు జేమీసన్ అంతలా సంబరపడ్డాడంటే.. ప్రత్యర్థి జట్టు అతడిని ఎంత పెద్ద వికెట్గా భావిస్తుందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి జేమీసన్ రియాక్షన్ను ఒక కాంప్లిమెంట్గా చూడాలి" అని రాజస్థాన్ రాయల్స్ కోచ్ విక్రమ్ రాథోడ్ వివరించారు.

బౌలింగ్ విభాగంపై కోచ్ అసహనం
ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ముందుగా బ్యాటింగ్ చేసి 225 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ.. మ్యాచ్ను కాపాడుకోలేకపోవడంపై విక్రమ్ రాథోడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బ్యాటర్లు తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. బౌలర్లు ప్రణాళికలను అమలు చేయడంలో మళ్లీ విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా పవర్ప్లే ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడం, భారీగా పరుగులు సమర్పించుకోవడం ఓటమికి ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు. బౌలింగ్ యూనిట్ సమిష్టిగా వైఫల్యం చెందడం వల్లే చేతిలో ఉన్న మ్యాచ్ చేజారిందని స్పష్టం చేశారు.
మిడిలార్డర్ రాణించడం సానుకూలాంశం
ఈ ఓటమిలో కూడా రాజస్థాన్ జట్టుకు కొన్ని సానుకూల అంశాలు లభించాయని రాథోడ్ తెలిపారు. ఇప్పటివరకు రాజస్థాన్ విజయావకాశాలు కేవలం ఓపెనర్లపైనే ఆధారపడి ఉన్నాయనే విమర్శ ఉండేది. కానీ ఈ మ్యాచ్లో ఓపెనర్లు ఇద్దరూ త్వరగా ఔటైనప్పటికీ, మిడిలార్డర్ బాధ్యతను భుజాన వేసుకుంది. రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, డోనోవన్ ఫెరీరా అద్భుతంగా రాణించి జట్టుకు భారీ స్కోరు అందించారు. జట్టు కేవలం ఒకరిద్దరిపైనే ఆధారపడటం లేదని నిరూపించడానికి ఈ ఇన్నింగ్స్ ఒక గొప్ప ఉదాహరణ అని, ఇది భవిష్యత్తు మ్యాచ్లలో జట్టుకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.