రాజస్థాన్ ఓడిపోతే బాలీవుడ్ బ్యూటీ భర్తకు అంత ఆనందమా?
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయి రాజస్థాన్ రాయల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరాజయం తర్వాత స్టేడియం వెలుపల ఓ కొత్త వివాదం చెలరేగింది. రాజస్థాన్ రాయల్స్ మాజీ సహ-యజమాని, నటి శిల్పాశెట్టి భర్త అయిన రాజ్ కుంద్రా సోషల్ మీడియా ప్లాట్ఫాం ఎక్స్ వేదికగా చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. రాజస్థాన్ ఓడిపోగానే రాజ్ కుంద్రా.. "కర్మకు కూడా ఒక ప్లేఆఫ్ ఉంటుంది" అంటూ చేసిన కామెంట్స్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాయి.
ఈ మ్యాచ్లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 96 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్తో రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయినప్పటీ గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో ఆ స్కోరును ఛేదించి.. 7 వికెట్ల తేడాతో గుజరాత్ను ఫైనల్కు చేర్చాడు. రాజస్థాన్ రాయల్స్ ఘోర పరాజయం పాలైన వెంటనే రాజ్ కుంద్రా స్పందిస్తూ.. కొన్ని పరాజయాలు పాయింట్ల పట్టిక కంటే చాలా పెద్దవని, కర్మ తన సొంత ప్లేఆఫ్ను కలిగి ఉంటుందని రాసుకొచ్చారు. ఈ కామెంట్స్ రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుత యాజమాన్యాన్ని, ఇటీవల జరిగిన జట్టు విక్రయ ఒప్పందాన్ని ఉద్దేశించి చేసినవేనని స్పష్టమవుతోంది.

రాజ్ కుంద్రాకు, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మధ్య వివాదం ఈనాటిది కాదు. 2009లో రాజ్ కుంద్రా ఈ జట్టులో వాటాదారుగా చేరాడు. అయితే 2013 నాటి ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వివాదంలో రాజ్కుంద్రా పేరు బయటకు రావడంతో కథ అడ్డం తిరిగింది. 2015లో సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆయనపై క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా జీవితకాల నిషేధం విధించింది. ఈ వివాదం కారణంగా రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి జట్టులోని అన్ని పదవుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా రాజస్థాన్ రాయల్స్ జట్టుపై కూడా ఐపీఎల్లో రెండేళ్ల పాటు నిషేధం పడింది.
ప్రస్తుతం రాజ్ కుంద్రా ఆగ్రహానికి అసలు కారణం రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం కొత్త చేతుల్లోకి మారడమే. ఇటీవల లక్ష్మీ మిట్టల్ గ్రూప్ ఈ జట్టును సుమారు 1.65 బిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు రూ. 13,700 కోట్లు) రికార్డు ధరతో కొనుగోలు చేసింది. ఈ డీల్ తర్వాత మిట్టల్ కుటుంబానికి జట్టులో 75 శాతం వాటా దక్కగా, అదార్ పూనావాలాకు 18 శాతం షేర్లు వచ్చాయి. అయితే ఈ కొనుగోలు ఒప్పందాన్ని ఆపాలని రాజ్ కుంద్రా గతంలోనే బీసీసీఐని, కోర్టును ఆశ్రయించారు. జట్టులో తనకున్న పాత 11.7 శాతం వాటాను చట్టబద్ధంగా ఎవరికీ బదిలీ చేయలేదని, కోర్టులో కేసు తేలేవరకు ఈ డీల్ను ఆపాలని ఆయన వాదించారు. అయినప్పటికీ బీసీసీఐ ఆయన అభ్యంతరాలను పక్కనబెట్టి ఈ భారీ విక్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, రాజస్థాన్ ఓటమిపై రాజ్ కుంద్రా ఈ రకమైన 'కర్మ' పోస్ట్తో తన అసంతృప్తిని వెళ్లగక్కారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications