హైదరాబాద్: మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని ప్రాంఛైజీలకు చెందిన ఆటగాళ్లు ప్రాక్టీస్ మ్యాచ్ల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో సురేశ్ రైనా 24 బంతుల్లో 7 సిక్సుల సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేసి ప్రత్యర్ధి జట్ల బౌలర్లకు తన సందేశాన్ని పంపాడు.
తాజాగా చెపాక్లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా విజృంభించాడు. సోమవారం రాత్రి చిదంబరం స్టేడియంలో హుస్ ఎలెవన్ (మైక్ హస్సీ), ఫ్లెమ్ ఎలెవన్ (స్టీఫెన్ ప్లెమింగ్) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
20 ఓవర్ల ప్రాక్టీస్ మ్యాచ్లో హుస్ ఎలెవన్ జట్టు తరుపున ఆడిన సురేశ్ రైనా 57 పరుగులు చేశాడు. ఒత్తిడిని ఎలా అధిగమించాలనే దానిపై ఈ ప్రాక్టీస్ మ్యాచ్ని నిర్వహించారు. అటు బ్యాటింగ్తో పాటు ఇటు బౌలింగ్లో కూడా రైనా ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు.
రైనాతో పాటు ఢిల్లీ యువ ఆటగాడు ధ్రువ్ షేరోయ్ 30 బంతుల్లో 47 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ ఓపెనర్ శామ్ బిల్లింగ్స్ 34 పరుగులతో రాణించారు. ఇరు జట్లకు ఇదొక చక్కటి ప్రాక్టీస్ మ్యాచ్లా గడిచింది. ఐపీఎల్ 11వ సీజన్ ఏప్రిల్ 4న ప్రారంభం కానుంది.
టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 7న ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనుంది. ప్రాక్టీస్ మ్యాచ్లో సురేశ్ రైనా సిక్సుల మోత మోగించిన వీడియో మీకోసం....