ICC Womens World Cup 2025: ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో శ్రీలంక, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య మంగళవారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయింది. దీంతో ఇరు జట్లు చెరో పాయింట్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య శ్రీలంక ఆరు వికెట్ల నష్టానికి 258 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. అయితే న్యూజిలాండ్ టార్గెట్ను ఛేదించడం ప్రారంభించక ముందే ఆర్ ప్రేమదాస స్టేడియంలో వర్షం ప్రారంభమైంది. ఆ తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభం కాలేదు.
భారత జట్టుకు గుడ్ న్యూస్
ఈ మ్యాచ్ రిజల్ట్ టీమిండియాకు లాభాన్ని చేకూర్చింది. శ్రీలంక నాలుగు మ్యాచ్లలో రెండు పాయింట్లతో ఏడో స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ మూడు పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో ఉంది. న్యూజిలాండ్కు ఇది పెద్ద ఎదురుదెబ్బ. ఎందుకంటే న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే రెండు పరాజయాలను చవిచూసింది. ఇప్పుడు సెమీ-ఫైనల్ రేసు మరింత కష్టమైంది. మ్యాచ్ రద్దు కావడం భారత జట్టుకు మేలు చేసింది. భారత్ ఇప్పుడు గరిష్టంగా 10 పాయింట్ల వరకు చేరుకోగలదు. అయితే న్యూజిలాండ్ జట్టుకు 9 పాయింట్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య కూడా మ్యాచ్ జరగాల్సి ఉంది. ఆ మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే సెమీఫైనల్లో స్థానం దాదాపు ఖాయం చేసుకుంటుంది.

శ్రీలంక బ్యాటింగ్
అంతకు ముందు బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. నిలాక్షిక డిసిల్వా(నాటౌట్ 55 పరుగులు), కెప్టెన్ చమరి ఆటపట్టు (53 పరుగులు) అర్ధ సెంచరీలతో ఆరు వికెట్లకు 258 స్కోరును సాధించింది. ఆటపట్టు 72 బంతుల్లో 7 ఫోర్లతో కూడిన ఇన్నింగ్స్ ఆడింది, మరోవైపు నిలాక్షిక టోర్నమెంట్లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీని (28 బంతులు) పూర్తి చేసి, తన ఇన్నింగ్స్లో7 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టింది.
యువ బ్యాటర్ విష్మి గుణరత్నే (42) తో కలిసి ఆటపట్టు 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి పటిష్టమైన పునాది వేసింది. హసిని పెరీరా కూడా 44 పరుగుల విలువైన సహకారం అందించింది. శ్రీలంక తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. బౌలింగ్ పవర్ ప్లే తర్వాత న్యూజిలాండ్ తిరిగి పుంజుకున్నప్పటికీ, శ్రీలంక తమ ఇన్నింగ్స్ చివరిలో నిలాక్షిక డిసిల్వా వేగవంతమైన బ్యాటింగ్తో 250 దాటింది. న్యూజిలాండ్ బౌలర్లలో సోఫీ డివైన్ 3 వికెట్లు పడగొట్టింది.