న్యూజిల్యాండ్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఇషాన్ కిషన్ (28 నాటౌట్) ఫర్వాలేదనిపించినా.. మరో ఓపెనర్గా వచ్చిన రిషభ్ పంత్ (6) విఫలమయ్యాడు. ఆఫ్స్టంప్ ఆవలగా పడిన షార్ట్ బాల్ను బలంగా బాదేందుకు పంత్ ప్రయత్నించాడు. దీంతో గాల్లోకి లేచిన బంతిని టిమ్ సౌథీ అద్భుతంగా అందుకున్నాడు. షార్ట్ థర్డ్లో ఫీల్డింగ్ చేస్తున్న అతను డీప్ థర్డ్ వరకు పరిగెత్తుకెళ్లి క్యాచ్ పట్టేశాడు. దీంతో 13 బంతుల్లో 6 పరుగుల స్కోరు వద్ద పంత్ నిరాశగా వెనుతిరగాల్సి వచ్చింది.
ఇన్నింగ్స్ ఓపెన్ చేసే అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. పంత్ అవుటైన తర్వాత సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. అతను కూడా కొంత ధాటిగా ఆడటంతో పవర్ప్లేను 42/1 స్కోరుతో నిలిచింది టీమిండియా. నీషమ్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో ఇషాన్ కిషన్ రెండు బౌండరీలు బాదాడు. ఆ వెంటనే వర్షం ప్రారంభమైంది. దీంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపేశారు. అప్పటికి భారత జట్టు 6.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్లో స్పెషలిస్టు ఓపెనర్లు సంజూ శాంసన్, శుభ్మన్ గిల్లను పక్కనపెట్టి మరీ పంత్ను ఓపెనర్గా పంపడం జరిగింది. అయినా సరే అతను ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. అతను తన తొలి పరుగులు బౌండరీతో చేయడంతో పంత్ కూడా గాడిన పడ్డాడనే అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన పంత్ తడబడ్డాడు. ఒకానొక దశలో 2 బంతుల్లో 4 పరుగులతో నిలిచిన అతను.. ఆ తర్వాత 12 బంతుల్లో 6 పరుగులతో ఉన్నాడు. పవర్ప్లే చివరి ఓవర్లో ఈ ఒత్తిడిని తగ్గించేందుకు భారీ షాట్ ఆడబోయి, సౌథీ అందుకున్న సూపర్ క్యాచ్కు పెవిలియన్ బాటపట్టాడు.