న్యూజిల్యాండ్, భారత్ మధ్య జరుగుతున్న రెండో వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది. తొలి వన్డేల భారీ స్కోరు చేసినా ఓటమిపాలైన టీమిండియా ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని అనుకుంది. అయితే ఆ ఆశలకు వరుణుడు గండి కొట్టాడు. హామిల్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. శుభ్మన్ గిల్ (19 నాటౌట్) తొలి మ్యాచ్లో ఆడినట్లు కాకుండా వేగంగా ఆడుతున్నాడు. మరో పక్క శిఖర్ ధవన్ (2 నాటౌట్) ఇంకా భారీ షాట్లు ఆడటం మొదలు పెట్టలేదు.
అయితే గిల్ బౌండరీలు బాదుతుండటంతో 4.5 ఓవర్లలో భారత జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. ఆ సమయంలో వర్షం పెద్దది అవడంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపేశారు. అయితే ఆ తర్వాత వర్షం ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. కాసేపు అలా తగ్గింది అనుకునేలోపే మరోసారి భారీ వర్షం మొదలైంది. వర్షం చాలా సేపుగా పడుతుండటంతో ఓవర్లు తగ్గిపోయే అవకాశం ఉంది. వర్షం ఇలాగే కొనసాగితే మాత్రం మ్యాచ్ రద్దు చేసే ప్రమాదం ఉంది. మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చిన చాలా మంది ప్రేక్షకులు నిరాశగా ఇంటి దారి పట్టారు.
అంతకుముందు టాస్ సమయంలో కూడా వర్షం అంతరాయం కలిగించింది. దీంతో ఆలస్యంగా టాస్ వేశారు. టాస్ నెగ్గిన కేన్ విలియమ్సన్ తాము ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. పిచ్ను కవర్స్తో కప్పి ఉంచారని, కాబట్టి పేసర్లకు సహకారం లభిస్తుందని అనుకుంటున్నామని చెప్పాడు. తాము కూడా టాస్ గెలిచి ఉంటే బౌలింగ్ ఎంచుకునే వాళ్లమని ధవన్ అన్నాడు.
కివీస్ జట్టులో ఒకే ఒక మార్పు చేసినట్లు కేన్ విలియమ్సన్ ప్రకటించాడు. పేసర్ ఆడమ్ మిల్నే స్థానంలో మైకేల్ బ్రేస్వెల్ను తీసుకున్నట్లు తెలిపాడు. అదే సమయంలో భారత జట్టులో రెండు కీలక మార్పులు చేసినట్లు ధవన్ వెల్లడించాడు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో దీపక్ చాహర్ ఆడుతున్నాడని, అలాగే సంజూ శాంసన్ స్థానంలో దీపక్ హుడాను తీసుకున్నామని వెల్లడించాడు. ఒకే ఒక్క అవకాశం తర్వాత మళ్లీ శాంసన్ను పక్కన పెట్టేయడంపై అభిమానులు ఏమాత్రం సంతోషంగా లేరు.
భారత జట్టు: శిఖర్ ధవన్ (కెప్టెన్), శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, దీపక్ హుడా, దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్,
న్యూజిల్యాండ్ జట్టు: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, డారియల్ మిచెల్, మైకేల్ బ్రేస్వెల్, టిమ్ సౌథీ, మిచెల్ శాంట్నర్, మ్యాట్ హెన్రీ, లోకీ ఫెర్గూసన్.