
మెల్బోర్న్: ఆస్ట్రేలియా వేదికగా ఆరంభమైన టీ20 ప్రపంచ కప్ 2022లో భాగంగా ఈ ఆదివారం భారత్-పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్పై అనుమానాలు నెలకొన్నాయి. రద్దయ్యే అవకాశాలే అధికంగా కనిపిస్తోన్నాయి. ఈ మ్యాచ్ కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న కోట్లాదిమందికి నిరాశ తప్పేలా లేదు. ఆసియా కప్ 2022లో జరిగిన ఘోర పరాభవానికి టీమిండియా ప్రతీకారాన్ని తీర్చుకుంటుందూ ఆశించే అభిమానుల ఉత్సాహంపై నీరుగారి పోయే పరిస్థితులు నెలకొన్నాయి.
దీనికి కారణం- వర్షం. ఆదివారం మెల్బోర్న్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ ఆస్ట్రేలియా వాతావరణం విభాగం.. బ్యూరో ఆఫ్ మెటెరాలజీ అంచనా వేసింది. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. లా నినా ప్రభావంతో మెల్బోర్న్ సిటీ మొత్తం మీద భారీ నుంచి అతి భారీ వర్షం పడొచ్చని స్పష్టం చేసింది.
ఆస్ట్రేలియా ఈశాన్య ప్రాంతం మీదుగా లా నినా విస్తరించిందని పేర్కొంది. వచ్చే నాలుగైదు రోజుల్లో ఇది మరింత విస్తృతమౌతుందని వివరించింది. అదే జరిగితే- మెల్బోర్న్ గీలాంగ్లోని సైమండ్స్ స్టేడియం వేదికగా జరుగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు కావడానికే అధిక అవకాశాలు ఉన్నాయి. ఇదొక్కటే కాదు.. శనివారం షెడ్యూల్ అయిన ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ మ్యాచ్ కూడా రద్దు కావొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12లో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్లో మధ్యాహ్నం 1:30 గంటలకు జరగాల్సిన మొట్టమొదటి మ్యాచ్ ఇది. సిడ్నీలో శనివారం వర్షం పడటానికి 90 శాతం మేర అవకాశాలు ఉన్నాయని బ్యూరో ఆఫ్ మెటెరాలజీ తెలిపింది. మూడు మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదు కావొచ్చనీ అంచనా వేసింది.
ఇదే పరిస్థితి మెల్బోర్న్లో కూడా ఉత్పన్నమౌతుందని పేర్కొంది. మెల్బోర్న్లో రాత్రి వేళ 10 నుంచి 25 మిల్లీమీటర్ల వరకు వర్షం పడటానికి 90 శాతం వరకు అనుకూల వాతావరణం ఉన్నట్లు వెల్లడించింది. టీ20 ప్రపంచకప్ 2022 గ్రూప్స్, సూపర్ 12 దశలో రిజర్వ్ డేలు లేవు. సెమీ ఫైనల్స్, ఫైనల్స్కు మాత్రమే ఈ సౌకర్యం ఉంది. మ్యాచ్ కొనసాగాలంటే కనీసం అయిదు ఓవర్లయినా పడాల్సి ఉంటుంది. అయిదు ఓవర్లు కూడా వేయలేని పరిస్థితి ఉంటే మ్యాచ్ రద్దవుతుంది. ఫలితంగా.. భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్పై ఇప్పటి నుంచే అనుమానాలు ఏర్పడుతున్నాయి.