ఇంకా 324 కొట్టాలి
328 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్లో 1.5 ఓవర్లలో 4 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఆ తర్వాత చాలా సేపటి వరకూ బ్రిస్బేన్లో వర్షం కురుస్తూనే ఉండటంతో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట నిలిచే సమయానికి భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (4), శుభ్మన్ గిల్ (0) క్రీజులో ఉన్నారు. గెలవాలంటే భారత్ ఇంకా 324 కొట్టాలి.
బ్రిస్బేన్ టెస్ట్ గెలిచేందుకు టీమిండియాకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఆసీస్ బౌలర్లను కూడా తక్కువగా అంచనా వేయకూడదు. ఆ జట్టులో ప్రపంచంలోని మేటి బౌలర్లు ఉన్నారు. మరి చివరి రోజు ఎవరు పైచేయి సాదిస్తే.. వారికే సిరీస్ సొంతం అవుతుంది.
స్మిత్ జోరు
అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 21/0తో ఆటను ఆరంభించిన ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో భారత్కు ఆసీస్ 328 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నాలుగో రోజు ఆటను ఆరంభించిన ఆసీస్కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (48), మార్కస్ హ్యారిస్ (38) తొలి వికెట్కు 89 పరుగులు జోడించారు. అయితే భారత బౌలర్లు పుంజుకుని వరుస ఓవర్లలో ఓపెనర్లను పెవిలియన్కు పంపించారు. తర్వాత క్రీజులోకి వచ్చిన మార్నస్ లబుషేన్ (25), స్టీవ్ స్మిత్ వేగంగా పరుగులు చేశారు. అయితే మొహ్మద్ సిరాజ్ ఒకే ఓవర్లో లబుషేన్, వేడ్ (0)ను ఔట్ చేసి ఆసీస్ను దెబ్బతీశాడు.
సిరాజ్ 5 వికెట్లు
వెంటవెంటనే రెండు కీలక వికెట్లు కోల్పోవడంతో ఆసీస్ లంచ్ విరామానికి ఆత్మరక్షణతో బ్యాటింగ్ చేసింది. అనంతరం గ్రీన్ (37)తో కలిసి స్మిత్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అయిదో వికెట్కు 73 పరుగులు జోడించాడు. అయితే అర్ధ శతకం సాధించిన స్మిత్ను సిరాజ్ ఔట్ చేయడంతో ఆసీస్ వికెట్ల పతనం మొదలైంది. అయితే క్రీజులోకి వచ్చిన వాళ్లంతా బ్యాటు ఝుళిపిస్తూ స్కోరు సాధించారు. రెండో ఇన్నింగ్స్లో హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ 5 వికెట్లు తీయడం విశేషం. సీనియర్ బౌలర్లు లేకపోయినా ఆ భారాన్ని తన భుజాలపై మోసిన సిరాజ్.. టెస్ట్ కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. శార్దూల్ కూడా 4 వికెట్లతో రాణించాడు.
ఫీల్డింగ్ చేస్తూనే.. స్మిత్ని టీజ్ చేసిన రోహిత్! ఇది అందుకు ప్రతీకారమేనా? (వీడియో)!