IND vs AUS: ఆస్ట్రేలియాలోని పెర్త్ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగుతోంది. కానీ అనుకున్నట్టుగానే వాతావరణం అనుకూలించక మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. మైదానంలో గాలి తీవ్రత ఎక్కువగా ఉండటం కారణంగా ముందు జాగ్రత్త చర్యగా పిచ్ ను కవర్లతో కప్పి ఆటగాళ్లను మైదానం నుంచి వెనక్కి పంపించారు. అయితే ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మాథ్యూ హేడెన్ అభిప్రాయం ప్రకారం.. ఈ ఆలస్యం ఎక్కువసేపు ఉండకపోవచ్చని తెలుస్తోంది.
అయితే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా ఆరంభంలో ఆస్ట్రేలియా పేసర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ను ఎదుర్కోవడంలో కాస్త ఇబ్బంది పడింది. ఆసీస్ ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా కష్టాలను ఎదుర్కొంటోంది. ఆసీస్ బౌలర్ల ధాటికి టీమిండియా 8 ఓవర్లలోనే మూడు కీలక వికెట్లను కోల్పోయింది. వెంటవెంటనే రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లీ(0), శుభ్మన్ గిల్ (10) ఔట్ కావడంతో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది.

జోష్ హేజిల్వుడ్ విసిరిన కఠినమైన లెంగ్త్కు టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ(8) వికెట్ కోల్పోయాడు. జోష్ హేజిల్వుడ్ (3.4వ ఓవర్) వేసిన బంతిని ఆడబోయి స్లిప్లో రెన్షాకు రోహిత్ దొరికిపోయాడు. అనంతరం మిచెల్ స్టార్క్ వేసిన వైడ్ బంతిని చేధించే ప్రయత్నంలో విరాట్ కోహ్లీ డకౌట్గా వెనుదిరగడం భారత అభిమానులను నిరాశపరిచింది. భారత్ 21 పరుగుల వద్ద ఉండగా.. స్టార్క్ బౌలింగ్లో (6.1వ ఓవర్) కనోలీ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో కోహ్లీ పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. అనంతరం కెప్టెన్ శుభ్మన్ గిల్ (10) కూడా పెవిలియన్కు చేరాడు. ఎల్లిస్ వేసిన (8.1వ ఓవర్) లెగ్సైడ్ బంతిని ఆడేందుకు గిల్ ప్రయత్నించగా.. వికెట్ కీపర్ క్యాచ్ పట్టడంతో వెనుదిరగాల్సి వచ్చింది.
అయితే ఈ దశలో భారత్కు ఈ వర్షం బ్రేక్ కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. ఈ విరామాన్ని ఉపయోగించుకుని మిగిలిన బ్యాటర్లు తమ వ్యూహాలను మెరుగుపరచుకోవడానికి, ఆరంభంలో ఎదురైన ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మ్యాచ్ త్వరగా ప్రారంభమై, ఆట తిరిగి కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.