దేశవాళీల్లో అద్భుతంగా రాణించాడు. ఆ తర్వాత ఐపీఎల్లో కూడా సత్తా చాటాడు. దీంతో తొలిసారి టీమిండియా నుంచి రాహుల్ త్రిపాఠీకి పిలుపొచ్చింది. ఆ సంతోషంతో రెక్కలు కట్టుకొని వాలిపోయాడు. కానీ అతనికి ఆడే అవకాశం మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాలేదు. జట్టులో ప్రధాన బ్యాటర్లంతా ఉండటంతో అతనికి అవకాశం దక్కడం కష్టంగా కనిపిస్తోంది.
అయితే బంగ్లాదేశ్తో జరిగే రెండో వన్డేలో అతనికి అవకాశం కల్పించాలని టీం మేనేజ్మెంట్ భావిస్తోందట. తొలి వన్డేలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన షెహబాజ్ అహ్మద్ను పక్కన పెట్టాలని టీమిండియా భావిస్తోంది. అయితే అక్షర్ పటేల్ గాయం నుంచి ఎప్పుడు కోలుకుంటాడో తెలియదు. దీంతో ఈ స్థానంలో త్రిపాఠీని ఆడించాలని అనుకుంటున్నారట. ఇదే జరిగితే రెండో వన్డేలో త్రిపాఠీ అరంగేట్రం చేస్తాడు. అవసరం అయితే బౌలింగ్ కూడా చేయగల సత్తా త్రిపాఠీకి ఉంది. కాబట్టి ఆల్రౌండర్ కోటాలో అతనికి జట్టులో చోటు దక్కొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కానీ త్రిపాఠీని తీసుకుంటే టీమిండియాలో లెఫ్ట్ హ్యాండర్లు తక్కువ అవుతారని కూడా కొందరు అంటున్నారు. అయితే టాపార్డర్లో శిఖర్ ధవన్, లోయర్ ఆర్డర్లో వాషింగ్టన్ సుందర్ ఉండగా మరో ఎడం చేతి వాటం బ్యాటర్ అవసరం ఏంటనేది కూడా బలమైన వాదనగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే త్రిపాఠీకి ఛాన్స్ దక్కుతుందని అంటున్నారు. అలాగే తొలి వన్డేలో ధారాళంగా పరుగులు ఇచ్చిన అరంగేట్ర ఆటగాడు కుల్దీప్ సేన్ను కూడా కొనసాగిస్తారట.
అదే సమయంలో ఉమ్రాన్ మాలిక్ను ఆడించాలని కూడా టీం మేనేజ్మెంట్ భావిస్తోందని, అతని కోసం ఎవరి పక్కన పెట్టాలని తర్జన భర్జనలు పడుతోందని సమాచారం. శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్లలో ఒకరిని పక్కన పెట్టి ఉమ్రాన్కు చోటు కల్పించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జమ్మూ ఎక్స్ప్రెస్ జట్టుతో కలిస్తే పేస్ బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారుతుందని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం.