దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ 'మహారాజా ట్రోఫీ కేఎస్సీఏ టీ20' వేలంలో మెరిశాడు. తక్కువ ధరకే పలికినప్పటికీ భారత స్టార్ ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం దక్కించుకున్నాడు. మహారాజా ట్రోఫీని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోషియేషన్ నిర్వహిస్తోంది. 2022 నుంచి నిర్వహిస్తున్న ఈ లీగ్లో ఆరు జట్లు పోటీపడతాయి.
2024 సీజన్కు గురువారం వేలం నిర్వహించగా సమిత్ ద్రవిడ్ను గతేడాది రన్నరప్గా నిలిచిన మైసూర్ వారియర్స్ దక్కించుకుంది. 18 ఏళ్ల ఆల్రౌండర్ సమిత్ కోసం మైసూర్ ఫ్రాంచైజీ రూ.50 వేలు వెచ్చించింది. కాగా, స్టార్ ఆటగాళ్లు ప్రసిధ్ కృష్ణ, కృష్ణప్ప గౌతమ్, కరుణ్ నాయర్తో కలిసి మహారాజా ట్రోఫీలో సమిత్ బరిలోకి దిగనున్నాడు.

సమిత్ ద్రవిడ్ మిడిలార్డర్ బ్యాటర్, అంతేగాక మీడియం పేసర్. అతను 2023-24 కూచ్ బెహార్ ట్రోఫీ గెలిచిన కర్ణాటక అండర్-19 జట్టులో సభ్యుడు. ఈ ఏడాది లాంక్షైర్తో జరిగిన మూడు రోజుల మ్యాచ్లో కేఎస్సీఏ ఎలెవన్ తరఫున ఆడాడు. కాగా, వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా వికెట్కీపర్ ఎల్ఆర్ చేతన్ నిలిచాడు. చేతన్ను బెంగళూరు బ్లాస్టర్స్ రూ.8.20 లక్షలకు సొంతం చేసుకుంది. గత సీజన్లో చేతన్ గుల్బర్గా తరఫున ఆడాడు.
కాగా, మాహారాజా ట్రోఫీలో గుల్బర్గా మిస్టిక్స్కు దేవదత్ పడిక్కల్, బెంగళూరు బ్లాస్టర్స్కు మయాంక్ అగర్వాల్, మోహ్సిన్ ఖాన్, హుబ్లీ టైగర్స్కు మనీష్ పాండే ప్రాతినిథ్యం వహించనున్నారు.
మైసూర్ వారియర్స్: కరుణ్ నాయర్, కార్తీక్ సీఏ, మనోజ్, కార్తీక్ ఎస్యూ, సుచిత్, కే గౌతమ్, విద్యాదర్ పాటిల్, వెంకటేశ్, హర్షిల్ ధర్మని, గౌతమ్ మిశ్రా, ధనుష్ గౌడ, సమిత్ ద్రవిడ్, దీపక్, సుమిత్ కుమార్, సమ్యాన్ శ్రీవాత్సవ, జస్పెర్, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సర్ఫరాజ్.