హైదరాబాద్: టీమిండియా కొత్త కోచ్గా రవిశాస్త్రిని ఎంపిక చేయడంతో పాటు బౌలింగ్ కోచ్గా జహీర్ ఖాన్ను, విదేశీ పర్యటనల్లో బ్యాటింగ్ కన్సల్టెంట్గా రాహుల్ ద్రవిడ్ని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఎంపిక చేయడం.. ఆ ఎంపికకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయింది.
జులై 26 నుంచి కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. అయితే టీమిండియా బ్యాటింగ్ కన్సల్టెంట్గా ఎంపికైన రాహుల్ ద్రవిడ్ ఈ పర్యటనకు భారత జట్టుతో వెళ్లడం లేదని వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు కోహ్లీసేనకు అవసరమైనప్పుడు మాత్రమే రాహుల్ ద్రవిడ్ సేవల్ని వాడుకుంటారని ఈ మేరకు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. క్రికెట్ నెక్ట్స్కి ఇచ్చిన ఇంటర్యూలో ఇదే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం అండర్-19, భారత్-ఏ జట్లకు కోచ్గా ఉన్న రాహుల్ ద్రవిడ్ యువ ఆటగాళ్లను దిద్దితీర్చే పనిలో బిజీగా ఉన్నారు.
అంతేకాదు జూనియర్ ఆటగాళ్లను జాతీయ ఆటగాళ్లుగా తీర్చిదిద్దడంలో బిజీగా ఉన్నారు. అంతేకాదు ప్రస్తుతం తీరిక లేకుండా ఉన్న రాహుల్ ద్రవిడ్ సేవల్ని 'అవసరమైనప్పుడు మాత్రమే' వినియోగించుకోవాలని షరతుని కూడా బీసీసీఐ విధించింది.
దీనిపై బీసీసీఐ లీగల్ బృందం కూడా తర్జనభర్జన పడుతోంది. కోహ్లీసేన శ్రీలంక పర్యటనలో భాగంగా మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ ఆడనుంది. అదే సమయంలో భారత్-ఏ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది.
దీంతో రాహుల్ ద్రవిడ్ ఇండియా ఏ జట్టుతో అక్కడి వెళ్తుండటంతో లంక పర్యటనకు అందుబాటులో ఉండడం లేదు. ద్రవిడ్ను సీనియర్ జట్టుతో పూర్తి సిరిస్ వరకు అందుబాటులో ఉండమని కోరలేమని కూడా పేర్కొన్నారు.
ఇక జహీర్ ఖాన్ను పూర్తి కాలం బౌలింగ్ కోచ్గా నియమించే విషయమై ఇంకా చర్చించలేదని త్వరలో దీనిపై కూడా నిర్ణయం కూడా తీసుకుంటామని అన్నారు. కుంబ్లే రాజీనామా చేయడంతో బీసీసీఐ రవిశాస్త్రిని టీమిండియా ప్రధాన కోచ్గా ప్రకటించడంతో పాటు జహీర్ ఖాన్ను బౌలింగ్ కోచ్గా, ద్రవిడ్ను విదేశీ టెస్టులకు బ్యాటింగ్ కన్సల్టెంట్గా నియమించిన సంగతి తెలిసిందే.