హైదరాబాద్: తన బౌలింగ్ను ఎదుర్కొన్న వాళ్లతో టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్లే అత్యుత్తమ బ్యాట్స్మెన్లని పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఆసిఫ్ పేర్కొన్నాడు. పాకిస్థాన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో ఆసిఫ్ మాట్లాడుతూ రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు.
తన కెరీర్లో ప్రపంచ క్రికెట్లో కఠినమైన ఆటగాళ్లు ఎవరైనా ఉంటే వారిద్దరేనని ఆసిఫ్ స్పష్టం చేశాడు. 'రాహుల్ ద్రవిడ్, లక్ష్మణ్లు టెక్నికల్గా ఎంతో నైపుణ్యం కలిగినవారు. ఆ ఇద్దరికీ ఆఫ్ స్టంప్ బంతులను వేయాలంటే చాలా భయపడేవాన్ని. వారికి ఆఫ్ స్టంప్ బంతులు వేయడం ఒక ఛాలెంజ్లా ఉండేది' అని ఆసిఫ్ అన్నాడు.

ఇక టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై కూడా ఆసిఫ్ ప్రశంసలు కురిపించాడు. విరాట్ కోహ్లి సాంకేతికంగా చాలా మెరుగైన ఆటగాడని, ఈ క్రమంలో అతడికి బౌలింగ్ చేయాలంటే ఏ బౌలరైనా శ్రమించక తప్పదని ఆసిఫ్ పేర్కొన్నాడు. కొత్త బంతితో తన కంటే మెరుగ్గా బౌలింగ్ చేసే బౌలర్ ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరని తనకు తాను ఆసిఫ్ కితాబిచ్చుకున్న సంగతి తెలిసిందే.
కాగా, 2010లో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడిన ఆసిఫ్ ఐదేళ్ల పాటు నిషేధం ఎదుర్కొన్నాడు. గతేడాది నిషేధం పూర్తి చేసుకున్న ఆసిఫ్ తిరిగి పాకిస్థాన్ జాతీయ జట్టులోకి పునరాగమనం కోసం వేచి చూస్తున్నాడు. త్వరలో వెస్టిండిస్ పర్యటనకు వెళ్లనున్న పాకిస్ధాన్ జట్టులో చోటు దక్కుతుందనే ఆశాభావంతో ఉన్నాడు. ప్రస్తుతం దేశవాళీ మ్యాచ్ల్లో సత్తా చాటుతున్నాడు.