మరిన్ని బాధ్యతలు:
ప్రస్తుత భారత యువ క్రికెట్ జట్ల(భారత ఎ, అండర్-19)కు ప్రధాన కోచ్గా వ్యవహరిస్తున్న ద్రవిడ్.. దేశంలో యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకురావడంతో పాటు జూనియర్ క్రికెట్ రోడ్ మ్యాప్లో కీలకం కానున్నారు. భవిష్యత్లో మహిళల క్రికెట్ను పర్యవేక్షించడానికి తోడు ఎన్సీఏతో పాటు జోనల్ క్రికెట్ అకాడమీలకు కోచ్లను నియమించనున్నారు. గాయపడ్డ క్రికెటర్లకు ఎన్సీఏలో చేపట్టే పునరావాస కార్యక్రమాలకు నేతృత్వం వహించనున్నారు.
పర్యటనలకు వెళ్లబోడు:
కొత్త బాధ్యతల నేపథ్యంలో ద్రావిడ్ ఇకపై భారత్-ఎ, అండర్-19 జట్లతో పాటు పర్యటనలకు వెళ్లబోరు. జట్లతో సుదీర్ఘ కాలం ద్రవిడ్ ప్రయాణించే అవకాశాలు లేవని బోర్డు అధికారి పేర్కొన్నారు. అయితే జూనియర్ క్రికెట్ టీమ్ జట్టు సహాయక బృందంలో భారత మాజీ పేసర్ పారాస్ మాంబ్రె, అభయ్ శర్మ కొనసాగనున్నారు.
ఏదో ఒకదానిలో మాత్రమే:
శనివారం జరిగిన సీవోఏ సమావేశంలో రాహుల్ నియామకంతో పాటు పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం చర్చకు వచ్చింది. మాజీ ఆటగాళ్లు సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ ఒకటిమించి పదవుల్లో ఉన్నందున వారు ఏదో ఒకదానినే ఎంచుకోవాలని బీసీసీఐ నైతిక విలువల అధికారి రిటైర్జ్ జస్టిస్ డీకే జైన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. సీఏసీ సభ్యులుగా ఉన్న గంగూలీ, లక్ష్మణ్ ఐపీఎల్ జట్లు ఢిల్లీ, హైదరాబాద్కు మెంటార్లుగా వ్యవహరిస్తున్నారు. గంగూలీ బెంగాల్ క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. ప్రస్తుతం ప్రపంచకప్లో వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్న గంగూలీ, లక్ష్మణ్..ఈ పదవుల్లో ఏదో ఒకదానిలో మాత్రమే కొనసాగాలని డీకే జైన్ ఆదేశించారు.
వాళ్ళు కూడా:
ప్రస్తుత ఉత్తర్వుల ప్రకారం.. క్రికెట్ నుంచి రిటైర్కాని రాబిన్ ఊతప్ప, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ కూడా ప్రపంచకప్ వ్యాఖ్యాతలుగా వైదొలగాల్సి ఉంటుంది. 'జస్టిస్ జైన్ ఆదేశాన్ని మేం పరిశీలిస్తాం. అలాగే మా న్యాయ విభాగం అభిప్రాయం కూడా తీసుకుంటాం. జైన్ ఆదేశాలపై ఏం చర్యలు తీసుకుంటామన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేం' అని బోర్డు అధికారి తెలిపారు.