ఢిల్లీ: భారత మాజీ కెప్టెన్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్ రాహుల్ ద్రవిడ్ను పరస్పర విరుద్ధ ప్రయోజనాల సెగ ఇంకా వెంటాడుతూనే ఉంది. నవంబర్ 12న ద్రవిడ్ వ్యక్తిగతంగా తన ముందు హాజరుకావాలని బీసీసీఐ ఎథిక్స్ అధికారి డీకే జైన్ గురువారం ఆదేశించారు. విరుద్ధ అభియోగాలపై ద్రవిడ్ మరింత సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇంతకుముందే సెప్టెంబర్ 26న మొదటిసారి ద్రవిడ్ ఎథిక్స్ అధికారి వద్ద విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.
India vs Bangladesh: షెడ్యూల్ ప్రకారమే ఢిల్లీ టీ20.. స్పష్టం చేసిన గంగూలీ!!
పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నాడని మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం సభ్యుడు సంజీవ్ గుప్తా ద్రవిడ్పై ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏ అధినేతగా ద్రవిడ్ పనిచేస్తున్నారు. అంతకుముందు భారత్-ఏ, అండర్-19 జట్లకు కోచ్గా వ్యవహరించారు. ఇక ఇండియా సిమెంట్స్లో ఓ విభాగానికి వైస్ ప్రెసిడెంట్. ఇవన్ని పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని సంజీవ్ ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు నేపథ్యంలో గత సెప్టెంబర్ 26న మొదటిసారి ద్రవిడ్ ఎథిక్స్ అధికారి డీకే జైన్ ముందు హాజరయ్యారు. ఆ సమయంలో 'ఇండియా సిమెంట్స్ నుంచి వేతనం చెల్లించని సెలవు తీసుకున్నా' అని వివరణ ఇచ్చారు. క్రికెట్ పాలకుల కమిటీ సైతం ఆయనకు మద్దతుగా లేఖ రాసింది. అయినా.. ద్రవిడ్ మరోసారి తనముందు హాజరయి మరింత స్పష్టత ఇవ్వాలని బీసీసీఐ ఎథిక్స్ అధికారి డీకే జైన్ ఆదేశాలు జారీ చేశారు.
పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు విరుద్ధ నిబంధనలో సవరణ చేయాలని సీఓఏ ఓ లేఖను సుప్రీం కోర్టుకు సమర్పించింది. దానిని కోర్టు ఆమోదిస్తే.. బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో రెండేళ్ల కాల పరిమితితో ఒప్పందాలు చేసుకున్న మాజీ క్రికెటర్లకు ఊరట లభించనుంది. సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ లాంటి దిగ్గజ క్రికెటర్లకు కూడా పరస్పర విరుద్ధ సెగ తాకిన విషయం తెలిసిందే. సచిన్, లక్ష్మణ్ కూడా డీకే జైన్ ముందు హాజరయి వివరణ ఇచ్చారు.