
ఆసియాకప్ టోర్నీకి ముందు టీమిండియాకు షాకింగ్ న్యూస్. భారత క్రికెట్ టీం ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్కు కరోనా కన్ఫామ్ అయింది. నేడో రేపో యూఏఈకి వెళ్లేందుకు సిద్ధమైన ద్రావిడ్ కరోనా బారిన పడడంతో అతను యూఏఈకి వెళ్లడం వాయిదా పడనుంది. ఇక ఐసోలేషన్ తదితర నిబంధనలు పాటించిన తర్వాతే అతను జట్టుతో కలవనున్నాడు. ద్రావిడ్తో సహా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేతో పాటు సీనియర్ సెలక్షన్ కమిటీ స్టాఫ్ జింబాబ్వేతో వన్డే సిరీస్కు విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆసియా కప్ కోసమే వీరికి రెస్ట్ ఇచ్చారు. జింబాబ్వే పర్యటన ముగియడంతో ఆసియా కప్ టోర్నీ కోసం మళ్లీ సీనియర్ టీంతో కలిసి రాహుల్ ద్రావిడ్ పనిచేయాల్సి ఉండగా.. ఆయనకు కోవిడ్ సోకడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక 5రోజులు ఐసోలేషన్ నిబంధనలు పాటించాల్సి రావడంతో టోర్నీ ప్రారంభ టైంకు ఆయన జట్టుతో చేరే అవకాశం కాస్త కష్టమే.
దీంతో ఆగస్టు 28న షెడ్యూల్ అయిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్కు ముందు జట్టు పర్యవేక్షణకు రాహుల్ ద్రావిడ్ దూరం కానున్నాడు. ఇక రాహుల్ స్థానంలో టీమిండియా సన్నాహకాలను పర్యవేక్షించేందుకు మరోసారి వీవీఎస్ లక్ష్మణ్ అవసరం ఏర్పడేలా ఉంది. ఇటీవలే జింబాబ్వేతో సిరీస్కు ఎన్సీఏ చీఫ్గా పనిచేస్తున్న వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన్ కోచ్ బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. ద్రావిడ్ గైర్హాజరీ టైంలో లక్ష్మణ్ స్టాండ్ ఇన్ కోచ్గా భారత జట్టును నడిపిస్తున్నాడు. అలాగే కొన్ని సిరీస్లకు సీనియర్ టీం కాకుండా యువ టీంను సెలెక్షన్ కమిటీ పంపిస్తుండగా.. ద్రావిడ్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఏదేమైనా రాహుల్ ద్రావిడ్ లేకున్నా ప్రత్యామ్నాయ కోచ్ భారత జట్టుకు అందుబాటులో ఉండడం ప్లసే. ఇక ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్కు వీవీఎస్ లక్ష్మణ్ జట్టు సన్నాహక బాధ్యతలు చూసుకోవడం ఖాయం. అయితే ద్రావిడ్కు కోవిడ్ నెగెటివ్ రిజల్ట్స్ వచ్చి అతను అందుబాటులోకి వస్తే అతనే కోచ్ బాధ్యతలు తీసుకోవచ్చు. కానీ ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్కు కేవలం 4రోజుల గ్యాపే ఉండడంతో.. లక్ష్మణ్నే తొలుత పంపించొచ్చు. మరీ బీసీసీఐ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.