
హైదరాబాద్: ఇండియా ఏ, అండర్-19 జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ అంటే తనకు ఎందుకు అంత ఇష్టమో చెప్పారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు. ఒక క్రికెటర్గానే కాదు.. వ్యక్తిగా కూడా ద్రవిడ్ తనకు అత్యంత ఇష్టమని ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
ఇటీవల ముగిసిన అండర్-19 వరల్డ్ కప్లో భారత యువ జట్టు విజేతగా నిలవడంలో తోడ్పడిన శిక్షణ సిబ్బందికి తనతో పాటు సమాన ప్రోత్సాహాకాన్ని ఇవ్వాలని రాహుల్ ద్రవిడ్ కోరిన సంగతి తెలిసిందే. దీంతో రాహుల్ మాటకు తలొగ్గిన బీసీసీఐ శిక్షణ సిబ్బందికి సమాన ప్రోత్సాహాకాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
దీనిపై ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన వార్త కథనాన్ని తన ట్విట్టర్లో నెటిజన్లతో షేర్ చేసిన కేటీఆర్... ఒక క్రికెటర్గానే కాదు.. వ్యక్తిగా కూడా ద్రవిడ్ తనకు అత్యంత ఇష్టమని ట్వీట్ చేశారు.
ఇటీవల న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ని భారత యువ జట్టు సొంతం చేసుకుంది. ఈ వరల్డ్ కప్ అనతంరం బోర్డు ద్రవిడ్కు రూ.50 లక్షలు, మిగతా సహాయ సిబ్బందిలో ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున ప్రోత్సాహకాల్ని ప్రకటించింది. దీనిపై కోచ్ రాహుల్ ద్రవిడ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
జట్టు కోసం తన సిబ్బంది అంతా సమష్టిగా శ్రమించారని, ఈ ఫలితంలో పేరొచ్చినా... ప్రోత్సాహకం వచ్చినా సమానంగా దక్కాల్సిందేనని డిమాండ్ చేశాడు. దిగ్గజ ఆటగాడి మాటకు విలువిచ్చిన బీసీసీఐ... ద్రవిడ్తో పాటు అందరికీ ఒకే రకంగా రూ.25 లక్షల చొప్పున నజరానా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది.