ఫలితంతో సంబంధం లేదన్నట్టుగా ఆడుతాడు
తాజాగా భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ నిర్వహించిన షోలో రాహుల్ ద్రవిడ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ధోనీకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలను ద్రవిడ్ను మంజ్రేకర్ అడిగాడు. ధోనీ నైపుణ్యాలపై మీ అభిప్రాయం ఏంటని అడగ్గా... 'చివరి ఓవర్లలో ఎంఎస్ ధోనీ ఆట చూడండి.. అత్యుత్తమంగా ఆడతాడు. అతడు ఎంతో సీరియస్గా ఆడుతున్నాడని అందరూ ఆనుకుంటారు. అయితే ఫలితంతో సంబంధం లేదన్నట్టుగా ప్రశాంతంగా బ్యాటింగ్ చేస్తాడు' అని ద్రవిడ్ చెప్పాడు.
ధోనీలా ఆడేందుకు ఎంతో ట్రైనింగ్ తీసుకోవాలి
'ఎంఎస్ ధోనీలా ప్రశాంతంగా ఆడేందుకు ఎంతో ట్రైనింగ్ తీసుకోవాలి. ఈ నైపుణ్యం నాకు లేదు. నా నిర్ణయం వల్ల వచ్చే పరిణామాలను నేనెప్పుడూ పట్టించుకునే వాడిని. ఫలితం గురించి దిగులు చెందకుండా.. ఉండడం సాధారణంగా వచ్చిందా లేక కెరీర్లో ఆడుతున్నప్పుడు అలవాటు చేసుకున్నావా అని మహీని ఓసారి అడిగా కూడా. అందుకు అతడు సమాధానం ఇచ్చాడు' అని టీమిండియా మాజీ సారథి ద్రవిడ్ తెలిపాడు.
నా నైపుణ్యం భిన్నమైంది
ఒకప్పుడు బ్యాటింగ్ చేసినట్లు ఇప్పుడు ఆడితే మనుగడ కష్టమేనని 'ది వాల్' రాహుల్ ద్రవిడ్ అన్నాడు. 'టెస్టుల్లో ఆడేటప్పుడు సుదీర్ఘ సమయం క్రీజులో పాతుకుపోయి బౌలర్లు అలసిపోయేలా చేసి, కొత్త బంతి మెరుపు తగ్గేలా చేసిన తర్వాత బ్యాటింగ్ చేయడం సులభంగా ఉండేది. మేం ఆడే సమయంలో నా బాధ్యత అదే. అలా అని వీరేందర్ సెహ్వాగ్లా షాట్లు ఆడకూడదని కాదు. నా నైపుణ్యం భిన్నమైంది. అప్పుడు ఆడినట్లు ఇప్పుడు ఆడితే మనుగడే ఉండదనిపిస్తోంది. ప్రస్తుత స్ట్రైక్ రేట్లే ఇందుకు ఉదాహరణ. మా సమయంలో వన్డేల్లో నా స్ట్రైక్రేట్ సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్ స్థాయిలో లేదు' అని ఆయన చెప్పాడు.
ఇప్పటికీ డిఫెన్స్ అవసరమే
'విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ బ్యాటింగ్తో నా ఆటను పోల్చుకోలేను. వాళ్లు వన్డే ఆటను వేరే స్థాయికి తీసుకెళ్లారు. నిజాయితీగా చెప్పాలంటే నేను టెస్టు క్రికెటర్గానే ఎదగాలనుకున్నా. వికెట్ కాపాడుకోవాలంటే ఇప్పటికీ డిఫెన్స్ అవసరమే. టీ20, వన్డేల్లో డిఫెన్స్ ఆడకపోయినా పర్లేదు కానీ.. సుదీర్ఘ ఫార్మాట్లో కుదరదు. కోహ్లీ, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్ లాంటి వాళ్లకు మెరుగైన టెక్నిక్ ఉంది. రక్షణాత్మకంగా ఆడడం వస్తే కీలక సమయాల్లో ఉపయోగపడుతుంది. క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లందరూ అద్భుతమైన టెక్నిక్ ఉన్నవాళ్లే' అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.