
బెంగళూరు: ఎన్నో ఏళ్ల నిరీక్షణను తెరదించుతూ ఏడాదిన్నర కిందట ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టు సిరీస్ అందుకుంది విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు. 1947 నుంచి భారత్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్నా 2018 వరకు ఒక్క టెస్టు సిరీస్లో కూడా విజయం సాధించలేదు. కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ఘనత సాధించి 71 ఏళ్ల కలను నెరవేర్చడంతో పాటు ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారిగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలుపుకుంది. నాలుగు టెస్టుల సిరీస్ను కోహ్లీసేన 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
అయితే ఈసారి మాత్రం ఆ దేశ పర్యటనలో టీమిండియాకు అంత సులువుగా ఉండదని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అంటున్నాడు. 'స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ జట్టుపై వేసే ముద్రే వేరు. గత సిరీస్లో వాళ్లిద్దరూ లేకపోవడం ఆస్ట్రేలియాపై చాలా ప్రభావం చూపింది. రాబోయే సిరీస్లో స్మిత్, వార్నర్లను కట్టడి చేయడం కోహ్లీసేనకు సవాలే. గత సిరీస్లో ఆసీస్ బ్యాట్స్మెన్ నుంచి బౌలర్లకు సహకారం లేకపోయింది. ఈసారి మాత్రం అలా జరగదు. అయితే భారత జట్టులోనూ అగ్రశ్రేణి ఆటగాళ్లున్నారు కాబట్టి ఆసీస్ను దీటుగానే ఎదుర్కొంటారని అనుకుంటున్నా' అని ద్రవిడ్ అన్నాడు.
టీమిండియా ఈ ఏడాది అక్టోబరు, జనవరి నెలల్లో రెండు విడతలుగా టీ20, టెస్టు సిరీస్ల కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. టీ20 ప్రపంచకప్ కన్నా.. ఈ టెస్టు సిరీస్ నిర్వహించడంపైనే క్రికెట్ ఆస్ట్రేలియా ఎక్కువ దృష్టి పెట్టింది. కరోనా వైరస్ కారణంగా నష్టపోయిన బోర్డు ఆదాయంను ఈ టెస్ట్ సిరీస్ ద్వారా కొంత పూడ్చాలని సీఏ చూస్తోంది. ఇక దక్షిణాఫ్రికాలో జరిగిన బాల్ టాంపరింగ్ ఉదంతం కారణంగా స్మిత్, వార్నర్లు ఏడాది పాటు నిషేదానికి గురైన విషయ అం తెలిసిందే.
అప్పటి సిరీస్లో ఛటేశ్వర్ పుజారా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగులతో విజయం సాధించింది. రెండో టెస్టులో ఆస్ట్రేలియా గెలుపొందడంతో సిరిస్ 1-1తో సమం అయింది. మెల్ బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా 137 పరుగులతో విజయం సాధించింది. సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టుకు పలు మార్లు వరుణుడు అంతరాయం కలిగించడంతో డ్రాగా ముగిసింది. దీంతో నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ను కోహ్లీసేన 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
ఈ సిరిస్లో జస్ప్రీత్ బుమ్రా 17 యావరేజితో 21 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఇందులో ఒక ఐదు వికెట్ల హాల్ కూడా ఉంది. ఇక ఛటేశ్వర్ పుజారా 74.42 యావరేజితో 521 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి.