
హైదరాబాద్: నాలుగు రోజుల క్రితం టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరును ప్రతిష్టాత్మక ద్రోణాచార్య అవార్డుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. రాహుల్ ద్రవిడ్ను ద్రోణాచార్య అవార్డుకు సిఫారసు చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
ద్రవిడ్ ఎంపిక బీసీసీఐలో చీలిక తీసుకొచ్చింది. కోచ్గా అంతగా అనుభవం లేని ద్రవిడ్ పేరును నామినేట్ చేయడమంటే ఎంతో మంది క్రికెటర్ల ప్రతిభను చిన్ననాడే పసిగట్టి వారిని సానబెట్టిన గురువులకు అన్యాయం చేసినట్టేనని ఓ వర్గం అభ్యంతరం లేవనెత్తగా.. మరో వర్గం మాత్రం ద్రవిడ్ పేరును బలపరుస్తోంది.
'ద్రవిడ్ను ద్రోణాచార్య పురస్కారానికి నామినేట్ చేయటం సమంజసం కాదు. కోచ్గా అతడి అనుభవం మూడేళ్లే. ఈ నిర్ణయం ఆటగాళ్లను చిన్నతనంలోనే సానబెట్టే గురువులకు అన్యాయం చేయటమే అవుతుంది. అలాగని ద్రవిడ్ బీసీసీఐకి అందిస్తున్న సేవలను నేను తక్కువ చేయటం లేదు. ఆ ప్రతిష్టాత్మక అవార్డుకు రాహుల్ ఇంకా తగిన అర్హత సాధించలేదు' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
రాహుల్ ద్రవిడ్ కోచ్గా వ్యవహరిస్తున్న అండర్-19 జట్టు ఇటీవల వరల్డ్ కప్ నెగ్గిన సంగతి తెలిసిందే. దీంతో సుప్రీం కోర్టు నియమించిన సీఓఏ రాహుల్ ద్రవిడ్ ద్రోణాచార్య అవార్డుకు అన్ని విధాల అర్హుడని చెబుతోంది. ఇందులో భాగంగానే సీఏఓ ఛీఫ్ వినోద్ రాయ్ ద్రవిడ్ పేరును నామినేట్ చేసినట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.
మరోవైపు భారత క్రికెట్కు గవాస్కర్ చేసిన సేవలకు గానూ ఆయన పేరును ధ్యాన్చంద్ లైఫ్టైం అచీవ్మెంట్ అవార్డుకు ప్రతిపాదించారు. అయితే, క్రీడా మార్గదర్శకాల ప్రకారం ఏదైనా ఆటలో 20 ఏళ్లు కోచ్గా అనుభవం ఉన్న వ్యక్తులనుగానీ లేదా తక్కువ సమయంలో గొప్ప ఆటగాళ్లను తయారు చేసే కోచ్ల పేర్లను ద్రోణాచార్య అవార్డుకు ప్రతిపాదించొచ్చు.