హైదరాబాద్: ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న అనిల్ కుంబ్లే పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో అనిల్ కుంబ్లేకు 'టీమ్ డైరక్టర్గా' ప్రమోషన్ ఇచ్చేందుకు బీసీసీఐ పరిపాలనా కమిటీ (సీఓఏ) యోచిస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
బీసీసీఐలో సంస్కరణల కోసం సుప్రీం కోర్టు నియమించిన బీసీసీఐ పరిపాలనా కమిటీ (సీఓఏ)తో బోర్డులో పెద్ద మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. గతేడాది వెస్టిండిస్పై 2-0తో టీమిండియా విజయం సాధించిన తర్వాత జులైలో అనిల్ కుంబ్లే టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టారు.

కుంబ్లే నేతృత్వంలో టీమిండియా న్యూజిలాండ్పై (3-0), ఇంగ్లాండ్పై (4-0), బంగ్లాదేశ్పై (1-0)తో విజయాలను సొంతం చేసుకుంది. అంతేకాదు టీమిండియాను టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకులో నిలబెట్టడంతో కుంబ్లే పాత్ర అమోఘం.
ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు మాదిరిగా కోచింగ్ సిస్టమ్లో మార్పులు తెచ్చేందుకు సీఓఏ చూస్తోంది. అటు కోచ్గాను ఇటు టీమ్ డైరక్టర్గా బాధ్యతలు నిర్వహించడం చాలా కష్టం, ఇందుకు చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది.
దీంతో అనిల్ కుంబ్లేని టీమ్ డైరెక్టర్గా ప్రమోట్ చేసిన ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్కు టీమిండియా కోచింగ్ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనబడుతున్నాయి. నిజానికి ఇలా చెప్పడం తొందరపాటు చర్య అవుతుంది. అయితే దీనిపై అనిల్ కుంబ్లేతో సీఓఏ చర్చించినట్లు తెలుస్తోంది.
దీనిపై టీమిండియా కెప్టెన్ కోహ్లీతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్ భారత్ అండర్-19 జట్టుతో పాటు ఇండియా ఏ జట్టుకు కోచ్గా వ్యవహరిస్తున్నాడు. అయితే త్వరలో అన్ని అనకూలిస్తే రాహుల్ ద్రవిడ్ను టీమిండియా హెడ్ కోచ్గా చూస్తాం అన్నమాట.
ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరిస్ ఆడుతోంది. ఈ సిరిస్ ముగిసిన అనంతరం బీసీసీఐ పరిపాలనా కమిటీ (సీఓఏ) కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.