
బెంగళూరు: జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) అధిపతి హోదాకు భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ తిరిగి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో టీ20 ప్రపంచకప్ 2021 అనంతరం రవిశాస్త్రి స్థానంలో ద్రవిడ్ భారత జట్టు హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరిస్తాడన్న ఊహాగానాలకు తెరపడ్డట్లయింది. ఎన్సీఏ అధిపతిగా ద్రవిడ్ రెండేళ్ల పదవీకాలం ముగియడంతో.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవలే ఆ పదవి కోసం దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కుర్రాళ్లను తీర్చిదిద్దడంలో ద్రవిడ్ సక్సెస్ అయినా.. నిబంధనల ప్రకారం అతడి పదవీకాలాన్ని బీసీసీఐ పొడిగించడానికి వీల్లేదు.
సమయం ముగిసేసరికి రాహుల్ ద్రవిడ్ ఒక్కడే ఎన్సీఏ అధిపతి హోదాకు దరఖాస్తు చేసుకోగా.. ఇంకెవరు పోటీలో లేరు. దీంతో అతనే మరోసారి ఎన్సీఏ చీఫ్గా ఖాయమైనప్పటికీ విమర్శలకు తావివ్వరాదనే ఉద్దేశంతో బీసీసీఐ దరఖాస్తు గడువును పొడిగించింది. ఇప్పటికైనా ఎవరైనా దరఖాస్తు చేసుకుంటారేమో చూడాలి. రెండేళ్ల క్రితం ఎన్సీఏ చీఫ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ద్రవిడ్ తనదైన ముద్ర వేశాడు. కుర్రాళ్లకు, పునరావాస శిబిరానికి వచ్చిన ఆటగాళ్లకు మార్గదర్శకుడిగా మారాడు.
రాహుల్ ద్రవిడ్.. రెండేళ్ల కాలానికిగానూ 2019 జులైలో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్నారు. దీంతో పాటు భారత అండర్-19, భారత-ఏ జట్లకు కోచ్గా వ్యవహరిస్తున్నారు. ది గ్రేట్ వాల్ ఆధ్వర్యంలో చాలామంది యువ క్రికెటర్లు గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండియా రిజర్వ్ బెంచ్ను బలంగా తయారుచేయడంలో ద్రవిడ్ పాత్ర ఎంతో కీలకం. ఐపీఎల్ టోర్నీలో కూడా ఎందరో ప్లేయర్స్ ప్రస్తుతం ఆడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్సీఏ అధిపతిగా ది వాల్ మరోసారి ఎన్నికయినట్టే.
శిఖర్ ధావన్ నేతృత్వంలోని యువ భారత్.. ఇటీవల పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించింది. ఈ యువ జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్గా వ్యవహరించారు. 2-1తో వన్డే సిరీస్ను గెలుపొందిన గబ్బర్ సేన.. 2-1తో టీ20 సిరీస్ను మాత్రం కోల్పోయింది. కరోనా వ్యాప్తి కారణంగా పలువురు స్టార్ ఆటగాళ్లు చివరి రెండు మ్యాచ్లకు దూరమయ్యారు. దీంతో భారత్ టీ20ల్లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయింది. మరోవైపు గాయాలతో బాధపడుతున్న యువ క్రికెటర్లు వరుణ్ చక్రవర్తి, కమలేశ్ నాగర్కోటి ఎన్సీఏ పునరావాస శిబిరానికి చేరగా.. శుబ్మన్ గిల్ ఇప్పటికే ఇక్కడ ఉన్నాడు. వీరిని ద్రవిడ్ దగ్గరుండి చూసుకుంటున్నారు.
ఈ ఏడాది చివర్లో జరగనున్న టీ20 ప్రపంచకప్తో టీమిండియా ప్రధాన హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. దీంతో అతని స్థానంలో రాహుల్ ద్రవిడ్ వస్తాడని అందరూ అంచనా వేశారు. ఇదే విషయాన్ని ద్రవిడ్ను అడగ్గా.. ఇప్పుడే అంతదూరం ఆలోచించలేదు అని ఇటీవలే చెప్పాడు. టీమిండియా ఫుల్ టైమ్ కోచింగ్పై మీ అభిప్రాయం ఏంటని అడగ్గా.. 'లంక పర్యటనను ఆస్వాదించాను. ఈ అనుభవం బాగుంది. నిజాయితీగా చెప్పాలంటే.. ఫుల్ టైమ్ కోచింగ్పై ఇంకా ఆలోచించలేదు. నాకు అసలు ఆ ఆలోచనే రాలేదు. ఇప్పుడు నేను చేస్తున్న పనితో సంతోషంగా ఉన్నా. ఈ టూర్ని ఆస్వాదించడం తప్ప.. మరే ఆలోచనలు చెయ్యట్లేదు. ఈ కుర్రాళ్లతో పనిచేయడం చాలా ఇష్టం. ఇది చాలా బాగుంది. మీకు ఓ విషయం చెప్పాలి.. ఫుల్ టైమ్ కోచింగ్ అంటే ఎన్నో సవాళ్లు ఉంటాయి. అవన్నీ నాకు తెలియదు' అని ద్రవిడ్ అన్నాడు.