
హైదరాబాద్: అండర్ 19 టీమిండియా ప్రధాన కోచ్, భారత బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్పై పెను బాధ్యతలు మోపుతున్నారు. ఇటీవల ఆయన సమన్యాయం కావాలంటూ బీసీసీఐకు చేసిన విజ్ఞప్తి ఫలించడంతో జట్టులో వాళ్లకు, ప్రధాన కోచ్ అయిన ద్రవిడ్కు, ఇతర సిబ్బందికి సమాన రివార్డులు ప్రకటించింది బీసీసీఐ. దీంతో ఏకంగా ద్రవిడ్ను ప్రధానిని చేస్తే దేశమంతటా సమన్యాయం ఉండేలా చూస్తాడంటూ అతనికి జేజేలు కొట్టేస్తున్నారు నెటిజన్లు.
అండర్-19 ప్రపంచకప్లో భారత జట్టు విజేతగా నిలిచేందుకు తోడ్పడిన శిక్షణ సిబ్బందికి సమాన ప్రోత్సాహాకాన్ని ఇవ్వనున్నట్లు బీసీసీఐ ప్రకటించిన తర్వాత మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయాడు రాహుల్ ద్రవిడ్. ఒక ప్రధాని స్థాయి ద్రవిడ్ అంటూ ఓ అభిమాని పేర్కొనగా, పీఎంగా అతన్ని గౌరవించాలని మరొక అభిమాని పేర్కొన్నాడు. ద్రవిడ్ను పీఎం చేస్తారని ప్రామిస్ చేస్తే పార్టీతో సంబంధం లేకుండా ఓటేస్తానని మరొకరు ట్వీట్ చేశారు. ద్రవిడ్ అవసరం భారత్కు ఉందని, అయితే పీఎంగా చేయాలనుకోవడం సరైనది కాదని మరొకరు అన్నారు. ఇలా భిన్నాభిప్రాయాల మధ్య రాహుల్ ద్రవిడ్-పీఎం చర్చ వాడివాడిగా నడుస్తోంది.
సమన్యాయం పాటించిన ద్రవిడ్:
అండర్ 19 వరల్డ్ కప్ గెలవగానే బీసీసీఐ ఆటగాళ్లకు రూ 30 లక్షలు, హెడ్ కోచ్ ద్రవిడ్కు రూ. 50 లక్షలు, సహాయ సిబ్బందికి రూ. 20 లక్షల చొప్పున ప్రోత్సాహకాల్ని ప్రకటించేసింది. దీనిపై ద్రవిడ్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. జట్టు కోసం తన సిబ్బంది అంతా సమష్టిగా శ్రమించారని, ఈ ఫలితంలో పేరొచ్చినా... ప్రోత్సాహకం వచ్చినా సమానంగా దక్కాల్సిందేనని డిమాండ్ చేశాడు.
ప్రపంచకప్ విజయంలో అందరిదీ సమాన పాత్ర అన్నాడు. తనకు ఎక్కువ మొత్తంలో ఇవ్వడం, మిగిలిన వారిని తక్కువ చేయడం సబబు కాదంటూ మండిపడ్డాడు. అంతేగాక, ద్రవిడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. బీసీసీఐ ఆలోచనలో పడింది.
దిగ్గజ ఆటగాడి మాటకు విలువిచ్చి ఏడాదికి పైగా యువ జట్టుకు సేవలందించిన కోచింగ్ సిబ్బందికి సమాన నజరానాలు ఇచ్చేందుకు ముందుకు రావడంతో ద్రవిడ్పై అభినందనల వర్షం కురిశాడు. జట్టు సభ్యులు, క్రికెటర్లు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.