
హైదరాబాద్: తాజాగా దక్షిణాఫ్రికా టూర్పై అందరితో పాటు మాజీ క్రికెటర్ రాహుల్ డ్రావిడ్ సైతం సూచనలిస్తున్నాడు. క్రికెట్ అభిమానులకు నిన్నటి వరకు విరాట్ కోహ్లీ , అనుష్కల పెళ్లి గురించి చర్చలు అయిపోయాయి. ఇక అందరి ధ్యాస దక్షిణాఫ్రికా పర్యటన గురించే. ఇప్పటికే ఈ పర్యటనపై పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు బయటపెట్టారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, అండర్-19 కోచ్ రాహుల్ డ్రావిడ్ సైతం భారత్ గట్టిపొటీనిస్తుందంటూ మీడియాతో మాట్లాడారు.
సిరీస్ గెలిచే అవకాశాలపై మాట్లాడుతూ.. సీనియర్ బ్యాట్స్మన్ సహాకారంతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. ఇప్పటికే దక్షిణాఫ్రికా జట్టు పటిష్టంగా ఉందని అభిప్రాయపడ్డాడు. అయినా వారిని ఎదర్కోగల సత్తా భారత్ జట్టుకు ఉందంటూ వాఖ్యానించాడు. 'బ్యాటింగ్, బౌలింగ్లో సమతూకంగా ఉన్న భారత జట్టుకు విజయవకాశాలున్నాయని' పేర్కొన్నాడు.
'జట్టులో మంచి ఆల్రౌండర్స్, స్పిన్నర్లు, పేస్ బౌలర్లున్నారు. దక్షిణాఫ్రికాకు తొలిసారేం వెళ్లడం లేదు. సీనియర్ బ్యాట్స్మన్ శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, చతేశ్వర పుజారా, రోహిత్ శర్మలు ఇంతకు ముందు దక్షిణాఫ్రికాలో ఆడారు. అక్కడి పరిస్థితులు వారికి బాగా తెలుసు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని సన్నదమైతే సునాయాసంగా విజయాన్ని సొంతం చేసుకోగలం' అని డ్రావిడ్ పేర్కొన్నాడు.
సహజంగానే ప్రతీ క్రికెటర్కు ఓ సమయంలో లక్ కలుసోస్తుంది. అది విరాట్కు ఈ పర్యటనలో జరిగితే ఇక కోహ్లిని ఎవరూ ఆపలేరని నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. 2011లో 1-1 మినహా భారత్ ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ గెలవలేదు. వరుస విజయాలతో ఊపు మీదున్న కోహ్లి సేన సిరీస్ గెలిచి రికార్డు నమోదు చేస్తుందని అందరు భావిస్తున్నారు.
ఈ ఏడాది మొదటి నుంచి మంచి ఫామ్లో దూసుకుపోతున్న భారత్ ఖచ్చితంగా పాత అంచనాలు తారుమారు చేసి విజయాన్ని పొందగలదంటూ భారత జట్టు అభిమానులు భావిస్తున్నారు. 2017 సంవత్సరంలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక జట్టులతో ఆడిన భారత్ విజేతగా నిలిచింది.
డిసెంబరు 27న శిక్షణ నిమిత్తం దక్షిణాఫ్రికాకు కోహ్లీసేన బయలుదేరనుంది. జనవరి 5 న్యూలాండ్లోని కేప్ టౌన్ వేదికగా మొదటి మ్యాచ్ జరుగుతుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.