Rajasthan Royals: ఐపీఎల్ 2025 సీజన్ మొత్తం కొత్త కొత్తగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఈ మెగా టోర్నమెంట్ ఆడే 10 ఫ్రాంఛైజీల యాజమాన్యాలు పూర్తిస్థాయిలో ప్రక్షాళనకు దిగాయి. ఈ దఫా జరిగే మెగా వేలం పాట సందర్భంగా దాదాపుగా కొత్త ముఖాలకు చోటు కల్పించవచ్చు.
ప్రత్యేకించి- గుజరాత్ టైటాన్స్లో భారీ స్థాయిలో మార్పులు చేర్పులు చోటు చేసుకోవచ్చని తెలుస్తోంది. 2022లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన తరువాత ఆ సీజన్లో ఛాంపియన్గా నిలిచిన జట్టు అది. ఫైనల్స్లో రాజస్థాన్ రాయల్స్ను మట్టి కరిపించి విజేతగా నిలిచింది. ఆ మరుసటి ఏడాది కూడా అదే స్థాయిలో సత్తా చాటింది. ఫైనల్స్ వరకూ చేరినా దాన్ని విజయంగా మలచుకోలేకపోయింది.

ఈ సీజన్లో మాత్రం చతికిల పడిందా టీమ్. లీగ్స్ దశలో ఆడిన మొత్తం 14 మ్యాచ్లల్లో గెలిచింది అయిదింట్లోనే. రెండు రద్దయ్యాయి. 12 పాయింట్లతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఓటమి అనంతరం గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ సీవీసీ కేపిటల్స్.. భారీగా మార్పులు చేర్పులకు తెర తీసినట్టే కనిపిస్తోంది.
ఇందులో భాగంగా తొలి వేటు హెడ్ కోచ్పై వేయటం ఖాయమైనట్టే. హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రాకు ఉద్వాసన పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మూడు సంవత్సరాల ఆశీష్ నెహ్రా కాంట్రాక్ట్ గడువు ముగిసినప్పటికీ దాన్ని రెన్యూవల్ చేయకపోవడం..ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది.
తాజాగా ఇదే తరహా పరిణామాలు రాజస్థాన్ రాయల్స్లోనూ చోటు చేసుకోనున్నాయి. ఈ టీమ్ హెడ్ కోచ్ కుమార సంగక్కార.. ఇంగ్లాండ్ వైట్ బాల్ ఫార్మట్ హెడ్ కోచ్గా నియమితుడయ్యే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వెలువడించనుంది ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్.
అదే జరిగితే ఐపీఎల్ నుంచి సంగక్కార తప్పుకోవచ్చు. అతని స్థానాన్ని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్తో భర్తీ చేయొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ద్రావిడ్ ఏ జట్టుతో కూడా అసోసియేట్ అయి లేడు. భారత జట్టు హెడ్ కోచ్గా పదవీ కాలం ముగిసినప్పటి నుంచి ఖాళీగానే ఉంటోన్నాడు.
ఆయనకు ఉన్న ట్రాక్ రికార్డ్ను ఆధారంగా చేసుకుని రాజస్థాన్ రాయల్స్ ద్రావిడ్కు హెడ్ కోచ్ పగ్గాలను అప్పగిస్తుందనే ప్రచారం జరుగుతోంది. అతని కోచింగ్లోనే భారత జట్టు గత ఏడాది ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్స్కు చేరింది. దురదృష్టవశావత్తూ అక్కడ ఓటమిపాలైంది. ఆ లోటును టీ20 వరల్డ్ కప్తో భర్తీ చేసుకుంది.