
ముంబై: భారత మాజీ సారథి, నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ రాహుల్ ద్రవిడ్ మరోసారి భారత జట్టును నడిపించనున్నాడని సమాచారం తెలుస్తోంది. ద్రవిడ్ టీమిండియా తాత్కాలిక కోచ్గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ 2021 అనంతరం సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరగబోయే సిరీస్కు ద్రవిడ్ను తాత్కాలిక కోచ్గా నియమించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రయత్నిస్తోందని బోర్డు వర్గాల ద్వారా సమాచారం తెలుస్తోంది. అతి త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకుంటున్న విషయం తెలిసిందే. రవిశాస్త్రి పదవీకాలం నవంబరు 14తో ముగియనుంది.
టీ20 ప్రపంచకప్ అనంతరం రవిశాస్త్రి తప్పుకోనుండటంతో అతని స్థానంలో భారత జట్టుకు కొత్త కోచ్ కోసం బీసీసీఐ చూస్తోంది. టీమిండియా కోచ్ పదవిపై ఎంతో మంది విదేశీయులు ఆసక్తిగా ఉన్నా.. బీసీసీఐ మాత్రం భారత ఆటగాడికి ఆ బాధ్యత అప్పగించాలని చూస్తోంది. అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్లను టీమిండియా కోచ్ పదవికోసం అడిగినా.. వాళ్లు సున్నితంగా తిరస్కరించారు. దీంతో జట్టుకు స్వదేశీ కోచ్ను నియమించడం అనుకున్నదాని కంటే ఎక్కువ సమయం పట్టేలా ఉంది. ప్రపంచకప్ తర్వాత న్యూజిలాండ్ సిరీస్ ఉంది. అప్పటిలోగా కొత్త కోచ్ ఎంపికయ్యే అవకాశం లేదు. దాంతో క్రికెట్ దిగ్గజం ద్రవిడ్ను కనీసం తాత్కాలిక కోచ్గా అయినా నియమించాలని బీసీసీఐ భావిస్తోందట.
టీ20 ప్రపంచకప్ 2021 ముగిసిన (నవంబర్ 17) మూడు రోజుల తర్వాత సొంతగడ్డపై న్యూజిలాండ్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ ఏడాది జూన్ మాసంలో శ్రీలంకలో పర్యటించిన భారత టీమ్కు రాహుల్ ద్రవిడ్ కోచ్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి భారత జట్టుకు కోచ్గా వ్యవహరించనున్నాడు. నిజానికి రవిశాస్త్రినే మరికొన్నాళ్లు కొనసాగించాలని ముందు భావించినా.. తర్వాత బోర్డు ఆ ప్రతిపాదనను విరమించుకుంది. మరోవైపు ఇప్పటికే రెండు పర్యాయాలు జట్టుకు సేవలందించిన రవిశాస్త్రి కూడా మరోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా లేడు.
భారత జట్టు కోచ్ పదవిపై పలువురు ఆస్ట్రేలియా మాజీలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే బీసీసీఐ మాత్రం ఇండియన్ కోచ్వైపే చూస్తోంది. దీనికోసం ముందుగానే సరైన వ్యక్తిని గుర్తించాలని అనుకుంటున్నట్లు ఓ బోర్డు అధికారి వెల్లడించారు. తీరా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎవరూ ఈ పదవికి సూట్ కాకపోతే బాగుండదని, అందుకే ముందుగానే సరైన వ్యక్తి కోసం అన్వేషిస్తున్నట్లు ఆ అధికారి చెప్పారు. అందుకు సమయం పట్టే అవకాశం ఉండటంతో రాహుల్ ద్రవిడ్ను తాత్కాలిక కోచ్ను చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ కోచ్ పదవి రేసులో ముందున్నారని తెలుస్తోంది.
గతంలో నలుగురు విదేశీయులు భారత జట్టు కోచ్గా చేశారు. జాన్ రైట్, గ్రెగ్ చాపెల్, గ్యారీ కిర్స్టెన్, డంకన్ ఫ్లెచర్ కోచ్లుగా ఉన్నారు. ఇందులో కిర్స్టెన్ సక్సెస్ అయ్యాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడి హయాంలోనే భారత్ 2011 వన్డే ప్రపంచకప్ గెలుచుకుంది. మరోవైపు అనిల్ కుంబ్లే కోచ్గా తిరిగి వచ్చే అవకాశం లేదని కూడా బీసీసీఐ స్పష్టం చేసింది. గతంలో 2016-17 సమయంలోనూ కుంబ్లే కోచ్గా చేశాడు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీతో పడక కుంబ్లే తన పదవికి రాజీనామా చేశాడు. ఇప్పుడు కూడా కోహ్లీ కెప్టెన్గా ఉండటంతో కుంబ్లే వచ్చే అవకాశాలు లేవని ముందు నుంచీ వార్తలు వస్తున్నాయి. ఈ పదవి తనకు ఇష్టం లేదని రాహుల్ ద్రవిడ్ చెపుతున్నాడు.