
హైదరాబాద్: అండర్-19 జట్టు కోసం రాహుల్ ద్రవిడ్ లాంటి గొప్ప మాజీ ఆటగాన్ని కోచ్గా నియమించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి ఆ దేశ మాజీ కెప్టెన్ రమీజ్ సూచించాడు. రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం అండర్-19, ఇండియా ఏ జట్ల కోచ్గా బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.
నైపుణ్యం ఉన్న యువ ఆటగాళ్లను గుర్తించి, అంతర్జాతీయ క్రికెట్కు సరిపోయే విధంగా మెరుగైన సలహాలు, సూచనలు ఇస్తూ యువ క్రికెటర్లలో ధైర్యాన్ని నింపుతున్నాడు. హార్ధిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ లాంటి ఆటగాళ్లు ఇప్పటికే జాతీయ జట్టులో చోటు దక్కించుకుని సత్తా చాటుతున్నారు.
మరికొంత మంది యువ ఆటగాళ్లు భారత జట్టు తరుపున ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. రాహుల్ ద్రవిడ్ కోచింగ్ స్కిల్స్, యువ ఆటగాళ్లను తీర్చిదిద్దుతున్న వైనం పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజాను ఆకట్టుకుంది. ఇంకేముంది పీసీబీ కూడా బీసీసీఐ అడుగుజాడల్లో నడవాలంటూ సలహా ఇచ్చాడు.
పాక్ అండర్-19 జట్టు కోసం ద్రవిడ్ లాంటి గొప్ప మాజీ ఆటగాణ్ని కోచ్గా నియమించండని పీసీబీకి రమీజ్ సూచించాడు. యువ క్రికెటర్లలో ప్రతిభను గుర్తించి.. వారిని సరైన రీతిలో శిక్షణ ఇవ్వడం ఎంతో ప్రయోజనం అని రమీజ్ రాజా ఈ సందర్భంగా తెలిపాడు.
'జట్టు గెలవడం కంటే నైపుణ్యం ఉన్న యువ ఆటగాళ్లను గుర్తించడం, వారికి మార్గనిర్దేశనం చేస్తూ.. ఎదిగేలా చూడటం ఎంతో ముఖ్యం. రాహుల్ ద్రవిడ్ లాంటి కోచ్ వల్ల భారత్ ఎంతో లబ్ధి పొందనుంది. యువ ఆటగాళ్లకు అతడో రోల్ మోడల్' అని రమీజ్ రాజా ప్రశంసల వర్షం కురిపించాడు.
రాహుల్ ద్రవిడ్ లాంటి వ్యక్తి మెంటార్గా ఉంటే యువ క్రికెటర్లు ఎంతో నేర్చుకుంటారని అన్నాడు. యువ క్రికెటర్లు ఉత్తమ వ్యక్తిగా, క్రీడాకారులుగా మారతారని రమీజ్ రాజా అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్ కూడా అండర్-16, అండర్-19 స్థాయిల్లో రాహుల్ ద్రవిడ్ లాంటి కోచ్ను నియమించుకోవాలని సూచించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.