భారత క్రికెట్లో కొత్త శకం మొదలుకానుంది. కోచ్గా గౌతమ్ గంభీర్, టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ బాధ్యతలు అందుకున్న తర్వాత టీమిండియా తొలి సిరీస్ ఆడనుంది. శ్రీలంక పర్యటనలో భాగంగా నేటి నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. పల్లెకెలె వేదికగా రాత్రి 7 గంటలకు ఇవాళ తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.
ఈ నేపథ్యంలో తన స్థానంలో బాధ్యతలు అందుకున్న నయా కోచ్ గౌతమ్ గంభీర్కు మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ శుభాకాంక్షలు తెలుపుతూ కీలక సందేశాన్ని పంపించాడు. తనకు దక్కిన గొప్ప ముగింపులా గంభీర్కు కలిసి రావాలని ద్రవిడ్ అన్నాడు. ఆటగాడిగా ఓటమిని అంగీకరించని దృఢత్వాన్ని , గెలవాలనే కసిని కోచ్గానూ కొనసాగించాలని గంభీర్కు 'వాల్' సూచించాడు. ఎంత ఒత్తిడిలో ఉన్నా చిరునవ్వును వదలకూడదని చెప్పాడు.

''అత్యంత ఉత్సాహవంతమైన భారత క్రికెట్ కోచ్ పదవిలోకి గంభీర్కు స్వాగతం. కలలకు మించి బార్బడోస్లో విజయంతో గొప్పగా నా పదవీకాలాన్ని ముగించా. విక్టరీ పరేడ్, భారత ఆటగాళ్లతో ఉన్న అనుబంధాన్ని ఎప్పటికీ మరవలేను. కొత్తగా బాధ్యతలు అందుకున్న నీకు కూడా కలిసిరావాలని కోరుకుంటున్నా. అలాగే అన్ని ఫార్మాట్లలో ఫిట్గా ఉన్న ఆటగాళ్లు అందుబాటులో ఉండాలని, అదృష్టం కూడా దక్కాలని ఆశిస్తున్నా''
''ఓ ఆటగాడిగా నువ్వు చేసిన గొప్ప ప్రదర్శన చూశాను. ఓటమి అంగీకరించని నీ దృఢత్వాన్ని, గెలవాలనే కసిని బ్యాటింగ్ పార్టనర్గా, సహచర ఆటగాడిగా చూశాను. ఇక యువ ఆటగాళ్లతో కలిసి పనిచేసే విధానం, అద్భుతంగా రాణించేలా జట్టును తీర్చిదిద్దే నీ సామర్థ్యం, భారత క్రికెట్పై ఉన్న అంకిత భావం నాకు తెలుసు. కోచ్గా అంచనాలు భారీగా ఉంటాయి. ఒకవేళ క్లిష్టపరిస్థితులు ఎదుర్కొన్నా నువ్వు ఎప్పుడూ ఒంటరివాడివి కాదు. ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్, మేనేజ్మెంట్ నీతోనే ఉంటారు. ఎంత ఒత్తిడిలో ఉన్నా చిరునవ్వుతోనే ఉండు'' అని గంభీర్కు ద్రవిడ్ సుదీర్ఘ సందేశాన్ని పంపాడు.
దీనికి గంభీర్ ఎమోషనల్ అయ్యాడు. సాధారణంగా తాను భావోద్వేగానికి లోనవ్వనని, కానీ ద్రవిడ్ సందేశంతో ఎమోషనల్ అయ్యానని తెలిపాడు. ద్రవిడ్ స్థానంలో బాధ్యతలు అందుకుని అంచనాలు అందుకోవడం అంత సులువు కాదని అన్నాడు. ఇక తాను కలిసి ఆడిన క్రికెటర్లలో అత్యంత నిస్వార్థ క్రికెటర్ ద్రవిడ్ అని కొనియాడాడు. కోచ్గా బాధ్యతలను నిజాయతీగా, పారదర్శకంగా నిర్వర్తిస్తానని, ద్రవిడ్ గర్వపడేలా సత్తాచాటుతానని గంభీర్ పేర్కొన్నాడు.