దుబాయ్: బ్యాటింగ్ లెజెండ్, టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్, కొత్తగా ఏర్పాటైన ఐసీసీ అవినీతి నిరోధక పర్యవేక్షణ బృందంలో సభ్యుడిగా నియమితుడయ్యాడు. ఐసీసీ ఛైర్మన్గా శశాంక్ బాధ్యతలు చేపట్టిన తొలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ పర్యవేక్షణ బృందం ఏడాదికి ఒకసారి సమావేమై, అవినీతిని నిరోధించేందుకు క్రికెట్ ఆట ఎంచుకున్న వ్యూహం, దాని అమలును సమీక్షిస్తుందని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు తగిన సూచనలు కూడా చేయనుంది. అవసరమైనప్పడు అవినీతి నిరోధక విభాగం ఛైర్మన్కు సలహాలు ఇస్తుంది.
రాహుల్ ద్రవిడ్తో పాటు న్యాయనిపుణుడు లూయిస్ వెస్టస్, అవినీతి నిరోధక సలహాదారు జాన్ అబాట్, అవినీతి నిరోధక వ్వవహారాలు చూసే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ ఈ బృందంలో ఉంటారు. ఇక అవినీతి నిరోధక విభాగం చైర్మన్ సర్ రోన్నీ ఫ్లన్గన్, ఐసీసీ సీఈఓ డేవిడ్ రిచర్డ్ సన్ గౌరవ సభ్యులుగా కొనసాగనున్నారని ఐసీసీ పేర్కొంది.
రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం టీమిండియా అండర్ 19 జట్టుతో పాటు బంగ్లాదేశ్లో ఉన్నారు. అండర్ 19 జట్టు కోచ్గా రాహుల్ ద్రవిడ్ వ్యవహరిస్తున్నారు. బంగ్లాదేశ్లో అండర్ 19 వరల్డ్ కప్ జరుగుతున్న సంగతి తెలిసిందే.